
పని మనుషులే ప్రాణాంతకులై..
కాళ్లు, చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై మోది
మూసాపేట: కూకట్పల్లిలోని స్వాన్లేక్ అపార్టుమెంట్లో గృహిణి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 5 టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంటి పని మనుషులే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి.. స్వాన్లేక్ అపార్టుమెంట్ 13వ అంతస్తులోని 1,311 బ్లాక్లో రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు నివాసముంటున్నారు. బాలానగర్, జీడిమెట్లలో స్టీల్ సామాను వ్యాపారాన్ని రాకేష్ అగర్వాల్, తన కుమారుడు శుభంతో నిర్వహిస్తు న్నారు. రాకేష్ భార్య రేణు (50) ఇంట్లోనే ఒక్కరే ఉండేవారు. వీరి కూతురు తమన్నా అహ్మదాబాద్లో ఎంబీఏ చదువుతోంది. కొన్ని నెలల క్రితం రేణు అగర్వాల్కు అనారోగ్యంగా ఉండటంతో బరువు పనులు చేసుకోలేకపోతున్నారు. దీంతో పని మనిషిని నియమించుకోవాల్సి వచ్చింది. వీరు నివసించే పై అంతస్తులో ఉండే బంధువుల ఇంటిలో పని చేస్తున్న రోషన్కు తెలిసిన వ్యక్తి హర్ష్ (20)ని 11 రోజుల క్రితం రేణు ఇంటితో పా టు మరో ఇంట్లో పనిలో కుదిర్చాడు. వీరు రేణు అగర్వాల్ ఇంట్లోనే ఉండేవారు. రేణు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రోషన్, హర్ష్లు ఆమెను హత్య చేయాలని పథకం రచించారు.
ఒంటరిగా ఉండటాన్ని గమనించి..
ఇదే అపార్ట్మెంట్లోని 14వ అంతస్తులో బంధువుల ఇంటిలో రోషన్ 11 నెలలుగా పని మనిషిగా చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు ఉండటం, రేణు ఇంటిలో ముగ్గురు కుటుంబ సభ్యులే ఉండటాన్ని గమనించాడు. రేణు భర్త రాకేష్, కుమారుడు శుభం ఉదయమే బయటకు వెళ్లేవారు. దీంతో రేణు ఒక్కరే ఇంట్లో ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన రోషన్, హర్ష్లు ఇద్దరూ కలిసి రేణు హత్యకు పథకం పన్నారు. బుధవారం రేణు భర్త, కుమారుడు బయటికి వెళ్లిన అనంతరం అదను చూసుకున్న నిందితులు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై మోది.. లాకర్ కోడ్ చెప్పాలంటూ హింసించారు. రెండు చేతులపై కత్తి గాట్లు, కడుపులో పొడిచిన గాట్లు, మెడను అత్యంత కిరాతకంగా కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. రేణు హత్య అనంతరం అనుమానితులిద్దరూ అక్కడే స్నానం చేసి దుస్తులు మార్చుకుని ఇంటికి తాళం వేసి లిఫ్ట్ నుంచి సెల్లార్లోకి వెళ్లారు. ఇంటి యజమాని స్కూటీపై బ్యాగ్తో పాటు ఇద్దరు పరారయ్యారు. లాకర్ ఓపెన్ చేసి డబ్బులు ఎంత మొత్తం దొంగిలించారో తెలియడంలేదు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం వెల్లడించలేదు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సుమారు 2 గంటల పాటు చక్కర్లు కొట్టి, స్కూటీని హఫీజ్పేటలో వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. స్నానం చేసి మరీ నింపాదిగా వెళ్లటంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
గాలింపు చర్యలు ముమ్మరం..
సుమారు 5 టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్, ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు, బాచుపల్లి డీఐ, కూకట్పల్లి డీఐ, కేపీహెచ్బీ డీఐలు టీములుగా ఏర్పడి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా, సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
స్కూటీపై పరారవుతున్న అనుమానితులు
కూకట్పల్లి పరిధిలో గృహిణి దారుణ హత్య
మర్డర్ అనంతరం స్నానం చేసి బ్యాగ్తో పరారీ
5 టీంలతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు

పని మనుషులే ప్రాణాంతకులై..