వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత శుక్రవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. ఈసందర్భంగా హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ సీపీకి స్వాగతం పలికి స్టేడియంలోని క్రీడా వసతులు వివరించారు. అనంతరం కమిషనర్ స్టేడియం ఆవరణతో పాటు స్విమ్మింగ్ పూల్ను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి డీవైఎస్ఓను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులతో కమిషనర్ ముచ్చటించారు. కార్యక్రమంలో వరంగల్ డీఎఫ్ఓ, ములుగు డీఎఫ్ఓ, స్టేడియం సిబ్బంది, కోచ్లు, క్రీడాకారులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో ప్రతిభ కనబర్చి హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 4, 7న రిపోర్ట్ చేయాలని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న 40 మంది బాలికలకు జూలై 4న, 40 మంది బాలురకు జూలై 7న జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, హనుమకొండలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ధ్రువపత్రాలు, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అడ్మిషన్ పూర్తయిన వెంటనే హాస్టల్లో చేరాల్సి ఉటుందని, లగేజీతో హాజరుకావాలని పేర్కొన్నారు.
రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి కళాశాలలో తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు.
హసన్పర్తి: ఇందిరమ్మ రాజ్యం అంటే కూల్చివేతలా.. ఓటు వేసి గెలిపిస్తే రోడ్డున పడేస్తారా అని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని 2వ డివిజన్ గుండ్లసింగారంలో అధికారులు ఇటీవల కూల్చిన ఇళ్లను శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర పహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావుతో కలిసి సందర్శించారు. వంటవార్పు కార్యక్రమం చేస్తున్న గుడిసెవాసులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహ, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్.స్టాలిన్, జిల్లా కార్యవర్గసభ్యులు రాములు, లక్ష్మణ్, సదానందం, భి క్షపతి, రాజేందర్, మొగిలి, గోపాల్ ఉన్నారు.
వెలుగుల తల్లి సన్నిధిలో చీకట్లు
హన్మకొండ కల్చరల్: కోట్ల రూపాయల ఆదాయం లభించే ఈ దేవాలయంలో చాలా రోజుల నుంచి జనరేటర్ పనిచేయట్లేదు. బ్యాటరీ, ఇన్వర్టర్ కూడా పనిచేయట్లేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు రాత్రి 8 గంటల వరకు దేవాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్చకులు చమురుతో దీపాలు వెలిగించి అమ్మవారికి పూజలు జరిపారు. ఈవిషయంపై సిబ్బందిని ప్రశ్నించగా.. మాడవీధుల నిర్మాణంలో భాగంగా కొత్త జనరేటర్ను తగిన చోట అమర్చాల్సి ఉందని తెలిపారు. భక్తులు చీకట్లోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి వచ్చింది.


