కాజీపేట అర్బన్ : వాతావరణంలో సమతుల్యత లోపించడం, తీవ్రమైన ఎండలు, ప్రకృతి విపత్తుతోనే కోడి గుడ్డు ధర పెరిగిందని వరంగల్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. హంటర్ రోడ్డులోని నెక్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లలో ఎన్నడులేని విధంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు, 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో గుడ్లు పెట్టే లక్షలాది కోళ్లు మృతి చెందాయని చెప్పారు. దీంతో పౌల్ట్రీ రైతులకు రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. కోళ్ల దాణా సోయా కేక్ టన్నుకు ధర రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెరిగిపోయిందని వాపోయారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


