రాజకీయాలకు వాడుకోవడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు వాడుకోవడం సరికాదు

Jul 4 2026 2:31 AM | Updated on Jul 4 2026 2:31 AM

ఏఐటీయూసీ నేత రాజ్‌కుమార్‌

భూపాలపల్లి అర్బన్‌ : సింగరేణి సంస్థను రాజకీయ వేదికగా మార్చడం మానుకోవాలని, కార్మికుల చెమటను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, గణాంకాల అంశంపై మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడాలనుకుంటే శాసనసభ సరైన వేదిక అని, అక్కడ ప్రభుత్వం, అవసరమైతే సింగరేణి యాజమాన్యం అధికారికంగా సమాధానం ఇస్తుందని తెలిపారు. గనుల వద్ద మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సంస్థను రాజకీయ వివాదాల్లోకి లాగడం వల్ల సింగరేణి ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన, గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కూడా బొగ్గు ఉత్పత్తి గణాంకాలపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్ట్యా సంస్థ పేరును రాజకీయ ప్రచారానికి వాడుకోవద్దని కోరారు.

ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

టీఆర్‌ఈ నాన్‌గెజిటెడ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి

హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ నాన్‌ గెజిటెడ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి పేర్కొన్నారు. తాము పెండింగ్‌ బిల్లులు అడుగుతుంటే ప్రభుత్వం ప్రమాద బీమా అమలు చేస్తామంటూ మభ్యపెడుతోందని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యజమాన్యం 42 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య నిధికి ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, 60 ఏళ్లు దాటిన వీఆర్‌ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పదవి విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ప్రయోజనాల బకాయిలు ఇప్పించాలని, వీటిని సాధించడానికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పాముకాటుతో

మహిళ మృతి

జఫర్‌గఢ్‌ : ఇంట్లో నేలపై నిద్రిస్తున్న మహిళ పాము కాటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని తిడుగు గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తిడుగు గ్రామానికి చెందిన మారపల్లి సౌందర్య (44), భర్త అంజయ్య, ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి ఇంట్లో నేలపై పడుకున్నారు. అర్ధరాత్రి సౌందర్య నిద్ర నుంచి లేచి ఏదో కుట్టినట్లుగా అనిపించిందని తన భర్తకు చెప్పడంతో అతను లేచి వెతకగా దుస్తుల్లో కట్లపాము కనిపించింది. దీంతో సౌందర్య పాముకాటుకు గురైందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే 108లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్ల వారుజామున మృతి చెందింది. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. కాగా బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

పాముకాటుకు గురైన మహిళ

చిల్పూరు : మండలంలోని ఫత్తేపూర్‌ గ్రామానికి చెందిన వడ్లూరి కోమలత శుక్రవారం పాము కాటుకు గురైంది. 108 సిబ్బంది ఈఎంటీ రాజేంద్రప్రసాద్‌, పైలట్‌ అమర్‌నాథ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోమలత శుక్రవారం పాఠశాల ఆవరణలో గడ్డి, చెత్తను తొలగిస్తుండగా కాలుపై పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement