ఐదేళ్ల లా విద్యార్థుల ఆందోళన బాట | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల లా విద్యార్థుల ఆందోళన బాట

Jul 4 2026 2:31 AM | Updated on Jul 4 2026 2:31 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు విద్యార్థులు (బాయ్స్‌) హాస్టల్‌ వసతి కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనబాట పడుతున్నారు. ఈ మేరకు శనివారంనుంచి రిలే నిరాహార దీక్షలకు దిగనున్నారు. యూనివర్సిటీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సు (ఎస్‌ఎఫ్‌సీ) ఐదేళ్ల లా కోర్సు ఏర్పాటుచేశాక తొలుత విద్యార్థినీ విద్యార్ధులకు హాస్టల్‌ వసతి కల్పించలేదు. పలుమార్లు ఆందోళనలు చేశాక గర్‌ల్స్‌కు యూనివర్సిటీ క్యాంపస్‌లో హాస్టల్‌ వసతి కల్పిస్తున్నారు. కానీ, బాయ్స్‌కు మాత్రం మెస్‌ సదుపాయం కల్పిస్తూ హాస్టల్‌ వసతి లేదు. వీరు గత ఏడాది సెప్టెంబర్‌లో యూనివర్సిటీ పరిపాలనాభవనం వద్ద బైఠాయించగా, యూనివర్సిటీ అధికారులు హాస్టల్‌ వసతిపై చర్చించారు. జులైవాడలోని లా హాస్టల్‌ భవనంలో మూడేళ్ల లా, ఎల్‌ఎల్‌ఎం విద్యార్దులకు హాస్టల్‌ వసతి ఉంది. కానీ, ఐదేళ్ల లా కోర్సు వారికి మెస్‌ సదుపాయం అదే హాస్టల్‌లో కల్పిస్తున్నప్పటికి వసతి లేదు. రిజిస్ట్రార్‌ రామచంద్రం జులైవాడలోని లా విద్యార్థుల హాస్టల్‌లో ఐదేళ్ల కోర్సు వారికి వసతికి ఇంకా అవకాశం ఉందా లేదా అనేది పరిశీలించాలని ఓ కమిటీని గత ఏడాది సెప్టెంబర్‌లో నియమించారు. కమిటీ గదులను మరమ్మతు చేయించి వసతి కల్పించవచ్చని రిజిస్ట్రార్‌కు నివేదిక సమర్పించింది. రిజిస్ట్రార్‌ రామచంద్రం కూడా రెండు గదులు కేటాయించాలని హాస్టళ్ల డైరెక్టర్‌ను ఆదేశిస్తూ ఆర్డర్‌ తీశారు. ఆర్డర్‌ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికి ఆ గదులకు మరమ్మతులు చేయించలేదు. దీంతో విద్యార్థులకు కేటాయించలేదు. దీంతో మరోసారి ఆందోళన బాట పట్టాలని విద్యార్ధులు నిర్ణయించారు. హనుమకొండ సుబేదారిలోని యూనివర్సి టీ లా కాలేజీ వద్ద నిరాహరదీక్షలకు దిగుతున్నట్లు లా కళాశాల విద్యార్థి స్టాలిన్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం యూనివర్సిటీ లా కాలేజి ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు సందీప్‌, రాకేష్‌రెడ్డి, అరుణ్‌, అజయ్‌, ఈశ్వర్‌, సాత్విక్‌, శ్రీను, పవన్‌, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్‌ వసతి కల్పించాలని డిమాండ్‌

నేటినుంచి విద్యార్థుల నిరాహార దీక్ష

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement