వరంగల్ పోలీసులు అధికారులను
వరంగల్ క్రైం : వరంగల్ పోలీసులు తమతో కలిసి పనిచేసిన అధికారులను గుండెల్లో నిలుపుకుంటారని పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బదిలీ అయిన సన్ ప్రీత్ సింగ్కు గురువారం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరించిన వాహనంపై సన్ ప్రీత్ సింగ్ను నిలబెట్టి పోలీస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతూ తమ అభిమానం, గౌరవం చాటుతూ భావోద్వేగ వీడ్కోలు పలికారు. అనంతరం సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 15 నెలలపాటు విధులు నిర్వర్తించిన కాలంలో ప్రతీ అధికారి, సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఇక్కడి అధికారులు, సిబ్బంది, ప్రజల ప్రేమ, ఆదరణ జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. భవిష్యత్లో కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డీసీపీలు ధార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్
సన్ ప్రీత్ సింగ్


