వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
వరంగల్ క్రైం: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలు సకాలంలో అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. కమిషనరేట్ పరిధి వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సీపీ శ్వేత బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతీ దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


