● ఆస్కీ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి
హన్మకొండ అర్బన్: నిర్మాణ వ్యర్థాలు విలువైన వనరులని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కేంద్ర డైరెక్టర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆస్కీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై శిక్షణలో ఆయన మాట్లాడారు. నిర్మాణ వ్యర్థాలను చెరువులు, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో వేస్తే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వాటిని సేకరించి, వేరు చేసి, తిరిగి ఉపయోగిస్తే సహజ వనరుల పరిరక్షణతోపాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఇటుకలు, కాంక్రీట్, రాళ్ల వంటి వ్యర్థాలతో రహదారులు, పేవర్ బ్లాకులు, ఇతర నిర్మాణ సామగ్రిని తయారు చేయవచ్చని వివరించారు. హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


