‘రోల్‌’ మోడల్‌గా కమిషనరేట్‌ పోలీస్‌! | - | Sakshi
Sakshi News home page

‘రోల్‌’ మోడల్‌గా కమిషనరేట్‌ పోలీస్‌!

Jun 30 2026 1:06 AM | Updated on Jun 30 2026 1:06 AM

వరంగల్‌ క్రైం : వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ రాష్ట్రానికి ‘రోల్‌’మోడల్‌గా నిలుస్తున్నారు. సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ కమిషనరేట్‌ పరిధిలో మే 29 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన రోల్‌ కాల్‌ సిస్టం సత్ఫలితాలు ఇస్తోంది. ఫలితంగా కేసుల ఛేదనలో వేగం పెరిగినట్లు తెలుస్తోంది. రోల్‌ కాల్‌ విధానం పోలీస్‌ వ్యవస్థ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్నా ఈ మధ్య కాలంలో ఎవరూ పాటించడం లేదు. తుతూ మంత్రంగా ఇంతకాలంగా కొనసాగిన రోల్‌కాల్‌ విధానం ఇప్పటి నుంచైనా సక్రమంగా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని సీపీ హెచ్చరించడంతో ఉదయం 9 గంటలకు కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ) రోల్‌ కాల్‌ తీసుకుంటున్నారు. దీంతో పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే అధికారులు నిర్ణయం తీసుకుని సిబ్బందిని క్షేత్రస్థాయి విచారణకు పంపిస్తున్నారు. దీంతో పాటు అధికారులు కచ్చితంగా 9 గంటలకు విధులకు హాజరవుతారనే నమ్మకం ప్రజల్లో కలిగింది.

విధులకు హాజరు తప్పనిసరి కావడంతో..

రాష్ట్రంలో పోలీస్‌ బాస్‌ నిర్ణయాలతో వరంగల్‌ కమిషనరేట్‌లో పోలీస్‌ వ్యవస్థ ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు సీపీ ప్రజలు, అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉంటున్నారు. ఎస్‌హెచ్‌ఓలు ఉదయం 9 గంటలకు రోల్‌ కాల్‌ తీసుకోవాలనే నిబంధనతో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది కచ్చితంగా సమయానికి హాజరవుతున్నారు. దీంతో ఫిర్యాదుదారులకు అధి కారులు అందుబాటులో ఉండడంతో సాయంత్రం వరకు వారి సమస్యలు సైతం పరిష్కారమవుతున్న ట్లు సమాచారం. కమిషనరేట్‌ పరిధిలో వివిధ మండలాల్లో ఎస్‌హెచ్‌ఓలుగా పనిచేస్తున్న చాలా మంది అధికారులు నగరంలో ఉంటున్నారు. దీంతో రాత్రి వచ్చి ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విధులకు హాజరయ్యేవారు. ఈ నేపథ్యంలో రోల్‌ కాల్‌ వ్యవస్థ అమలు జరిగిన నెల వ్యవధిలోనే పోలీస్‌ వి ధుల్లో చాలా మార్పులు తీసుకొచ్చినట్లు పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమయం సరిపోక ఉక్కిరిబిక్కిరి..

రోల్‌ కాల్‌ సత్ఫాలితాలు ఇస్తున్నా ఎస్‌హెచ్‌ఓలు స మయం సరిపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలు స్తోంది. ట్రై సిటీ పరిధితోపాటు చుట్టు పక్కల పీ ఎస్‌లకు ఫిర్యాదుదారుల తాకిడి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే టెలీ కాన్ఫరెన్స్‌ మొదలవుతుంది. మొదట సబ్‌ ఇన్‌స్పెక్టర్లను ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లను ఏసీపీ, డీసీపీ, సీపీ టెలీకాన్ఫరెన్స్‌ ఉంటుంది. ఈ తంతు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. 9 గంటలకే రోల్‌ కాల్‌ ఉండడంతో సమయం సరిపోవడం లేదని, ఈ విషయంలో మార్పు తీసుకొస్తే బాగుంటుందని పలువురు ఎస్‌హెచ్‌ఓలు అభిప్రాయపడుతున్నారు.

9 గంటలకు స్టేషన్‌లో

కొలువుదీరుతున్న ఎస్‌హెచ్‌ఓలు

ఫిర్యాదులపై తక్షణ స్పందన..

ప్రజల్లో కలుగుతున్న నమ్మకం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement