హన్మకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం వరంగల్ పర్యటన వాయిదా పడినట్లు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ఆయన హనుమకొండ హంటర్ రోడ్డులోని మైదానంలో బీఆర్ఎస్ వరంగల్ తూర్పు కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. అయితే కేటీఆర్ జ్వరంతో బాధపడుతుండడంతో వాయిదా వేసినట్లు వివరించారు. ఎప్పుడు జరిగేది తర్వాత తెలుపుతామని నరేందర్ తెలిపారు.
నేడు బల్దియా గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, నగర పౌరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేటి నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసీం ఇక్బాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29, జూలై 1, 3, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు.
జర్మనీ పర్యటనకు పింగిళి కళాశాల అసోసియేట్
ప్రొఫెసర్ సురేశ్బాబు
విద్యారణ్యపురి: జర్మనీలో స్టడీ టూర్కు రాష్ట్రం నుంచి వెళ్తున్న అధికారిక విద్యా ప్రతినిధి బృందంలో హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సురేశ్బాబు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి ఆదివారం తెలిపారు. జూన్ 28 నుంచి జూలై 6వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుందని తెలిపారు. జర్మనీలో ఉన్నత విద్యావిధానాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ విద్యాసంస్థల భాగస్వామ్యం, పరిశోధన, వినూత్న పాఠ్యప్రణాళికలపై అధ్యయనం చేసే బృందంలో మొత్తం 35మంది ఉంటారని స్పష్టం చేశారు.
ిసీకేఎం పిల్లల వార్డులో పాము ప్రత్యక్షం
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పాముల భయం నెలకొంది. తాజాగా శనివారం ఎస్ఎన్సీయూ పిల్లల వార్డులోని సింక్ వరకు ఓ పాము రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. పసికందులు ఉండే ఫొటోథెరపీ రూంలోకి పాము వచ్చి బల్లిని నోటకర్చుకోవడంతో సిబ్బందితోపాటు బాలింతలు భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత పాము వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూడు రోజుల క్రితం కూడా ఓ పాము వచ్చిందంటూ పేషెంట్ల అటెండెంట్లు తెలిపారు. ఇలా పాములు వస్తే తమ బిడ్డలు, పసికందుల పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు. పాముల విషయంపై ఇన్చార్జ్ ఆర్ఎంఓ సృజన్ను వివరణగా కోరగా... పాము వార్డులో కి వచ్చినట్లు తెలిసిందని, అప్పుడు తాను కలెక్టరేట్లో ఉన్నానని చెప్పారు. అయినా వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించామని, పాములు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.


