● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
హన్మకొండ చౌరస్తా: ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి.. పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం వారు సంయుక్తంగా ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు తప్పనిసరి చుక్కల మందు వేయించాలన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. 84,301 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ దుర్గారామ్ కుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్, మాస్ మీడియా అధికారి సుభాష్, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఈవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పల్స్పోలియో 96 శాతం పూర్తి
రామన్నపేట: జాతీయ పల్స్పోలియో కార్యక్రమం తొలి రోజు (ఆదివారం) హనుమకొండ జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.డి. రామ్కుమార్ తెలిపారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు గాను పోలియో బూత్లు, ట్రాన్సి ట్ పాయింట్లు, మొబైల్ బృందాల ద్వారా 81,139 మంది చిన్నారులకు (96 శాతం) పోలియో చుక్కలు అందించినట్లు వెల్లడించారు. మొదటి రోజు పోలియో చుక్కలు తీసుకోలేని మిగిలిన చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు.. ఆరోగ్య సిబ్బందికి సహకరించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్ఓ రామ్కుమార్ విజ్ఞప్తి చేశారు.


