హన్మకొండ చౌరస్తా : ఘంటసాల గంధర్వ గానా మృత వేదిక, లిటిల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గానకళ తపస్వి డా క్టర్ శరత్ చంద్ర దర్శకత్వంలో ఆదివారం హనుమకొండ పద్మాక్షి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన ‘స్వర వైభవం’ అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జగదీశ్ బాబు, ప్రొఫెసర్ తిరుపతయ్య హాజరై మా ట్లాడుతూ వర్ధమాన గాయనీగాయకులను ప్రోత్సహించడం, సంగీత సంస్కృతిని భావితరాలకు చేరవేయడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. సుమారు 50 మంది గాయనీగాయకులు పాల్గొని ఘంటసాలతో పాటు పలువురు ప్రముఖ గాయకుల మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉపేందర్, నిమ్మల శ్రీనివాస్, ఎంఎల్ రావు, దేవేంద్రాచారి, టీవీ రమేశ్, చోటు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఐఏఎస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు.


