వరంగల్ అర్బన్: మహానగర ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ము దుర్వినియోగమవుతోంది. ప్రజాప్రతినిధుల పాలనలో ఒకరకమైన అక్రమాలు జరిగితే.. వారి పాలన రద్దయిన నాటి నుంచి గ్రేటర్ వరంగల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కొంతమంది వింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని, ఖరీదైన వాహనాలను వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారికి ప్రజాధనం ఆటవిడుపుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రస్తుతం కొత్తగా వచ్చిన కమిషనర్కు వాహనం కరువైంది.
మేయర్, కమిషనర్
కార్లు వింగ్ అధికారులకు..
పదేళ్ల కిందట బల్దియా కొనుగోలు చేసిన విలువైన ఫార్చునరీ, ఇన్నోవా క్రిష్టా కార్లను గ్రేటర్ వరంగల్ మేయర్లు, కమిషనర్లు వినియోగించుకున్నారు. ఈ ఏడాది మే6న పాలకవర్గం రద్దయ్యింది. అప్పటి నుంచి ఫార్చునరీ కారు బల్దియాకు పరిమితమైంది. మూడు నెలల కిందట బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పదోన్నతిపై హనుమకొండ కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్థానంలో ఎవరిని నియమించకపోవడంతో ఇన్చార్జ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ, ఆకారును పెద్దగా వినియోగించుకోలేదు. మే మొదటి వారంలో మేయర్ పదవీ కాలం పూర్తయ్యింది. ఆరోజు నుంచి మేయర్ వాహనం కుడా బల్దియా ప్రధాన కార్యాలయానికే పరిమితమైంది. మేయర్, కమిషనర్ వినియోగించిన బల్దియా కార్లు పదేళ్లు దాటిపోయినందున కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పట్లో పాలకవర్గం ఏర్పడే పరిస్థితులు లేవు. మరో ఆరు నెలల కాలం పట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నెలకు రూ.34వేలకు బదులు
మూడింతల భారం
బల్దియాలో వింగ్ అధికారికి కారు సౌకర్యం కల్పిస్తారు. అందుకోసం నెలకు రూ.34 వేల వేతనం చెల్లిస్తారు. అద్దెకారు, డ్రైవర్, డీజిల్, వాహన నిర్వహణ బాధ్యతలు సదరు వ్యక్తి భరిస్తాడు. దీంతో బల్దియాకు పెద్ద అదనపు భారం లేదు. మేయర్ వాహనాన్ని బల్దియా ఎస్ఈ రాజ్కుమార్, కమిషనర్ వాహనాన్ని అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా వినియోగించుకుంటున్నారు. వీరు మేం తక్కువ అంటూ తాటికాయ అక్షరాలతో ఆ వాహనాలకు నేం బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఒక్కో వాహనానికి ఇద్దరు డ్రైవర్లు పనిచేస్తుంటారు. ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనం నెలకు రూ.20వేలపైనే. ఇలారెండు వాహనాల డ్రైవర్లకు నెలకు రూ.80 వేల వేతనం చెల్లించాల్సి వస్తోంది. డీజిల్, వాహనాల నిర్వహణ, అంతేకాకుండా బల్దియా సొమ్ముతో ఈ వాహనాలకు మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. ఇలా సగటున నెలవారీగా రెండు వాహనాలకు వ్యయం రూ.1.60 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవానికి అద్దె కార్లు కేటా యిస్తే రూ.68 వేలతో సరిపోతోంది. కానీ, బల్దియా అధికారులు మాత్రం ఆ వాహనాలను మూలకు చేర్చితే ఏం వస్తుందని వింత ప్రశ్నలు వేస్తున్నారు.
ముందుచూపులేని జీడబ్ల్యూఎంసీ
యంత్రాంగం
ఖరీదైన వాహనాలు వినియోగిస్తున్న వింగ్ అధికారులు
డీజిల్, మరమ్మతులు, డ్రైవర్ల పేరుతో
రూ.లక్షల ప్రజాధనం వృథా


