శనీశ్వరుడికి పూజలు | - | Sakshi
Sakshi News home page

శనీశ్వరుడికి పూజలు

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

శనీశ్వరుడికి పూజలు డీఈఈ సెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన రైతులు దరఖాస్తు చేసుకోవాలి కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక

హన్మకొండ కల్చరల్‌: శనిత్రయోదశిని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌శర్మ ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో శనీశ్వర ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారు.

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని డైట్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ప్రవేశాలకు ఈనెల 29న మూడోదశ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు హనుమకొండలోని ప్రభుత్వ డైట్‌ (జిల్లా విద్యాశిక్షణ సంస్థ) ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌ బి.రంగయ్యనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతల ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, ర్యాంకు కార్డు, హాల్‌టికెట్‌, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమో, నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, టీసీ, ఎన్‌సీసీ, క్రీడలు, పీఎస్‌ ధ్రువపత్రాలు తీసుకొని హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకున్న అభ్యర్థులు ఈనెల 30న ఆప్షన్లు ఇచ్చుకోవాలని, జూలై 4న మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, 9న కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని ఆయన కోరారు.

హన్మకొండ: నూతనంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు జూలై ఐదో తేదీలోపు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి వి.విజయచంద్ర కోరారు. ఈ నెల 15వ తేదీలోపు సీసీఎల్‌ఎ ద్వారా భూభారతి పోర్టల్‌ నమోదైన రైతులు ఏఈఓలను కలిసి వివరాలు అందించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సీజన్‌లో రైతు భరోసా సాయం అందని రైతులు తమ బ్యాంకు ఖాతాలు సరి చేసుకుని, ఫోన్‌ నంబర్‌గా తప్పుగా నమోదైన రైతులు, ఒకటి కంటే ఎక్కువ ఆధార్‌ నంబర్లు అనుసంధానమైన రైతులు వెంటనే సవరణలు చేసుకోవాలని, ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీ విధిగా చేయించుకోవాలని కోరారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ సమావేశం శనివారం హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్‌ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సి.రామాజంనేయులు, ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కై లాశ్‌యాదవ్‌, లీగల్‌ అడ్వైజర్లు సత్యనారాయణ, తిరుమల, విరందరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా బండారి సంతోష్‌, జనరల్‌ సెక్రటరీగా సిరిగిరి తిరుపతి, కోశాధికారిగా సాదినేని శ్యాంకుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా సీహెచ్‌ సుప్రియ, జాయింట్‌ సెక్రటరీగా ఎస్‌.సాంబశివ, కార్యవర్గ సభ్యులుగా పి.దినేశ్‌తేజ, పి.గణేశ్‌తేజ ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement