హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాకు తొలి విడత మంజూరైన 3,243 ఇళ్ల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. వనమహోత్సవం కింద 8 లక్షల మొక్కలను నాటాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తున్న 2,074 మంది అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని, రూఫ్ రీప్లేస్మెంట్ దశలో ఉన్న 615 మంది లబ్ధిదారుల వివరాలను కూడా పరిశీలించాలని సూచించారు. .
పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 0–5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రీ స్కూల్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రీ స్కూల్ వయస్సు పిల్లలందరూ క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, హాజరును ఫేస్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయాలన్నారు.


