ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్
హన్మకొండ అర్బన్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో బుధవారం కలెక్టరేట్లో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని కూడా అదే బాధ్యతతో చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి సర్పంచ్లు ముందుండాలని కోరారు. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. డీఈఓ గిరిరాజు బాబు, అధికారులు, సర్పంచ్లు, ఎంఈఓలు పాల్గొన్నారు.
హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్..
మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి ‘హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్–2026’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. 3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్లను ఏ భారతీయ భాషలోనైనా రూపొందించవచ్చని, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తప్పనిసరి అని వివరించారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.2లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1.5 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్షతో పాటు ప్రత్యేక ప్రస్తావనకు ఎంపికై న నాలుగు చిత్రాలకు తలా రూ.50 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల సమాచారాన్ని విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంట్రీలను జూన్ 30లోగా పంపాలని తెలిపారు.


