కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట, వరంగల్ మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
జనవరి 8వ తేదీన కాకినాడ టౌన్–వికారాబాద్ (07460) వీక్లి ఎక్స్ప్రెస్ కాజీపేట, వరంగల్కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయన్పాడ్, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 9, 11వ తేదీల్లో వికారాబాద్–పార్వతీపురం (07461) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 10వ తేదీన పార్వతీపురం–వికారాబాద్ (07462) వీక్లి ఎక్స్ప్రెస్లు కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ రైళ్లకు లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్పాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 8వ తేదీన సికింద్రాబాద్–పార్వతీపురం (07464) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 9వ తేదీన పార్వతీపురం–సికింద్రాబాద్ (07465) వీక్లి ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్పాడ్, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలిలో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సోమవారం నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● భట్టుపల్లి రోడ్డులో ఘటన
ఖిలా వరంగల్: రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ఓ బైక్.. ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ మిల్స్కాలనీ పీఎస్ పరిధిలోని ఉర్సుగుట్ట భట్టుపల్లి రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన ప్రవీణ్యాదవ్ (25) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం బైక్పై వరంగల్ వెళ్లి పని పూర్తయిన అనంతరం సాయంత్రం భట్టుపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో రెడీమిక్స్ ప్లాంట్ వద్ద కరీమాబాద్కు చెందిన గొట్టె కుమారస్వామి బైక్పై రాంగ్రూట్లో వచ్చి ప్రవీణ్యాదవ్ను ఢీకొనగా అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి బాషబోయిన ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు.
ఫార్మసీ విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్
● యూఎస్ఏ ఎఫ్డీఏ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి
కేయూ క్యాంపస్: ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని యూఎస్ఏ ఎఫ్డీఏ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు.సోమవారం హనుమకొండలోని కేర్ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఫార్మసీలో నూతన ఔషధాల ఆవిష్కరణలకు పరిశోధనలు చేయాలని సూచించారు. సదస్సులో కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, డాక్టర్ రాజేందర్, డాక్టర్ డి.సుధీర్కుమార్, డాక్టర్ మంజుల పాల్గొన్నారు. అనంతరం రమణకుమారిని సన్మానించారు.
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
● కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం
కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.రామచంద్రం కోరారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈస్ట్జోన్ గోల్డ్కప్– 2025 క్రికెట్ పోటీలు కాకతీయ యూనివర్సిటీలోని క్రీదామైదానంలో మూడవ రోజు సోమవారం కొనసాగాయి. హనుమకొండ వర్సెస్ మహబూబాబాద్ జట్ల మధ్య పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జనవరి 1వ తేదీ వరకు పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు


