వరద బాధితులను ఆదుకుంటాం
పంట నష్టం నివేదికను అందించండి ● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హసన్పర్తి: మోంథా తుపాను బాధితులను ఆదుకుంటామని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. హసన్పర్తి మండలం వంగపహాడ్, బైరాన్పల్లిలో ఆదివారం కలెక్టర్ పర్యటించారు. వరదలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. వరదలతో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో దెబ్బతిన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. త్వరలోనే నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మోంథా తుపానుతో నష్టపోయిన పంట వివరాల నివేదికను వెంటనే అందించాలని ఆదేశించారు. రైతుల సర్వే నంబర్లతోపాటు క్షేత్రస్థాయిలో ఏ మేరకు నష్టం జరిగిందనే అంచనా వేసి నివేదిక రూపొందించాలని సూచించారు. అనంతరం వంగపహాడ్–బైరాన్పల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయాధికారులు, రైతులు ఉన్నారు.
వరద బాధితులను ఆదుకుంటాం


