
ఆదర్శం.. కల్వల ప్రాథమిక పాఠశాల
● మూడు రోజుల్లో 65 అడ్మిషన్లు
కేసముద్రం: విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్న క్రమంలో మండలంలోని కల్వల ప్రాథమిక పాఠశాల కేవలం మూడు రోజుల్లోనే 65 అడ్మిషన్లు సాధించి ఇతర స్కూళ్లకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కల్వల ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థులుండగా ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఇంటింటి ప్రచారం చేశారు. దీంతో సోమవారం నాటికి 65 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఫలితంగా ఆ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 127కి చేరింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్, వీఆర్ఏ మహేశ్, నవోదయ గెస్ట్ లెక్చరర్ తమ పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ యాదగిరి, హెచ్ఎం కళ్లెం వీరారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తమ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దుతామని, అనేక సౌకర్యాలు కల్పించామన్నారు.