
నేడు కేయూ పాలకమండలి సమావేశం
● అభివృద్ధి పనుల నిధుల కేటాయింపులకు ప్రతిపాదనలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నేడు (మంగళవారం) హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ఉదయం 10:30 గంటలకు ఫైనాన్స్ కమిటీ సమావేశం ఉంటుంది. కేయూ ప్రహరీకి రూ.20కోట్లు, పద్మాక్షి మహిళా హాస్టల్ డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.3.5కోట్ల నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదించనున్నారు. అలాగే యూనివర్సిటీలోని వివిధ సెమినార్ హాల్స్ మరమ్మతులకు, కేయూ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు, వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్న కేయూ 23వ స్నాతకోత్సవ నిధుల వ్యయానికి కూడా ఫైనాన్స్ కమిటీ ఆమోదానికి ప్రతిపాదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కేయూ పాలకమండలి సమావేశం ఎజెండాలో పేర్కొన్న వివిధ అంశాలతోపాటు అభివృద్ధికి వెచ్చించే నిధులపై కూడా చర్చించి ఎన్ని ఆమోదం ఇస్తారో తెలియనుంది. వరంగల్ పశ్చిమ నియోజక వర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేయూలోని భూమిని కేటాయించే విషయంపై కూడా పాలకమండలిలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమావేశంలో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యా కమిషనర్ శ్రీదేవ సేన, పాలక మండలి సభ్యులు, ఫైనాన్స్ సెక్రటరీ పాల్గొననున్నారు.