
వరంగల్కు కేటీఆర్ చేసిందేంటో చెప్పాలి
హన్మకొండ చౌరస్తా: గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ వరంగల్ నగర అభివృద్ధికి చేసిందేంటో చెప్పాలని, లేదంటే 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు తేడా తెలియని మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్.. భద్రకాళి చెరువు పూడికతీతను పరిశీలించడం హాస్యాస్పదం అన్నారు. కమీషన్ల కోసమే చెరువు అభివృద్ధి పనులంటూ ఆరోపించడం చూస్తుంటే దొంగలే దొంగ అంటున్న సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా బయట తిరగరన్నారు. తన సొంత ఊరు వడ్డ్డేపల్లి రైతుల భూములను లాక్కోవాలని చూసిన వినయ్భాస్కర్కు మా గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. నాడు కేసీఆర్ పాలనలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వ్యతిరేకించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, నేడు వత్తాసు పలకడం సిగ్గుచేటని అన్నారు. సమావేశంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీటీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి