
పేదల సంక్షేమమే లక్ష్యంగా మోదీ పాలన
హన్మకొండ: సేవా, సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన సాగుతున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డి.కె.అరుణ అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమానికి, సుపరిపాలన, దేశ భద్రతకు, అలాగే రోడ్లు, రైల్వే, విద్య, వైద్యం, ఉపాధికి అంత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఎంటీఎస్ విస్తరణకు సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులతో యాదగిరి గుట్ట వరకు రూ.400 కోట్లతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. మామునూర్ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నామని, రూ.500 కోట్లతో వరంగల్లో టెక్స్టైల్స్ పార్కు, గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పీఎం సూర్యఘర్ బిజిలీ యోజన పథకం ద్వారా పేదలకు సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామని, ఒక్కరికి నెలకు ఉచితంగా 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తున్నదని, మహిళలకు ముద్ర రుణాలు రూ.20 లక్షల వరకు పెంచినట్లు వివరించారు. అంతకు ముందు మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, నాయకులు చొల్లేటి కృష్ణమాచారి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, దొంతి దేవేందర్రెడ్డి, డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు, రావుల కిషన్, బైరి లక్మి, రావుల కోమల, చాడ స్వాతి, గుజ్జుల వసంత, గొట్టికొప్పుల రాంబాబు, కందగట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
11 ఏళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు
అన్ని రంగాల అభివృద్ధిలో
దేశం పరుగులు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు,
ఎంపీ డీకే.అరుణ