
519 మంది విద్యార్థులు.. 15 మంది టీచర్లు
ప్రైవేట్కు దీటుగా కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలలో బోధన
ఖిలా వరంగల్: కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 75 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు. దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 519 మంది విద్యార్థులకు 15 మంది ఉపాధ్యాయులు, 9 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు మాధవి విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్నారు. ఈ సంవత్సరం పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధనతోపాటు మెరుగైన వసతులు ఉన్నాయి. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల బాధ్యులు అందిస్తున్న ఉచిత నోట్బుక్స్, పెన్నులు, బ్యాగులు, సైకిళ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు.