
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, భూమి కొలతల శాఖ ఏడీ శ్రీని వాసులు, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి..
భూసేకరణ పూర్తయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి భీమదేవరపల్లి, వేలేరు మండలాల పరిధి గౌరవెల్లి ప్రాజెక్టు, పరకాల నియోజకవర్గ పరిధి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్, జిల్లాలో వివిధ రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపు, భూసేకరణ పురోగతి అంశాలపై నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
సఖి భవన ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
కాజీపేట అర్బన్: హనుమకొండ లష్కర్బజార్లో నూతనంగా నిర్మించిన సఖి కేంద్ర భవనాన్ని త్వరలో ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సఖి నూతన భవనాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. డీడబ్ల్యూఓ జయంతి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, సఖి కేంద్ర కో–ఆర్డినేటర్ హైమావతి, డీఈ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.