
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజలనుంచి స్వీకరించిన వినతులు ఆయా శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాల ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్య హాజరై ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖల సంబంధించి మొత్తం 137 వినతులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేష్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేష్, నారాయణ, అధికారులు పాల్గొన్నారు.
లోపాలు చూపినందుకు బహిష్కరించారు..
పెద్ద మనుషుల లోపాలు ఎత్తి చూపినందుకు తనను కుల బహిష్కరించి ఇబ్బందులకు గురి చేసున్నారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని హసన్పర్తి మండలం జయగిరికి చెందిన తాళ్లపల్లి రామకృష్ణ వాపోయారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందించారు. గౌడ వృత్తిమీద జీవనోపాధి పొందుతున్న తనను పెద్ద మనుషుల తప్పులను లేవనెత్తినందుకు తాళ్లు ఎక్కకుండా కుల బహిష్కరణ చేసి పరువు తీస్తూ, ఐదు నెలలుగా జీవనోపాధిని దూరం చేసి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
వృద్ధాశ్రమంలో చేర్పించండి..
నాభర్త వెంకటరెడ్డి 14 ఏళ్ల క్రితం చనిపోయాడు. మాకున్న 16 ఎకరాల భూమిని పిల్లలకు సమానంగా పంచేశాం. నాభర్త చనిపోయాక నన్ను ఎవరూ సాకడం లేదు. వారితో పోరాడి వారిని ఎదురించే స్తోమత నాకు లేదు. నాకున్నది ఒక ఇల్లు, ఇంటి స్థలం మాత్రమే. నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించండి. నా ఆలనాపాలనా చూసి, నా అంత్యక్రియలు చేసిన వారికే నా ఇల్లు, ఇంటి స్థలం చెందేలా అఽధికారులు చర్యలు తీసుకోండి.
– చింతకుంట్ల కమలమ్మ, ఊరుగొండ