● ఆలయంలో మరోమారు బయటపడ్డ భద్రతా లోపం ● సోషల్ మీడియాలో పోస్ట్పై పోలీసులకు ఫిర్యాదు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి రాజగోపురం ఎదుట యువతి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై ఆలయ అధికారులు ఆదివారం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 7న గుంటూరుకు చెందిన ఓ యువతి రాజగోపురం ఎదుట డ్యాన్స్ చేసింది. సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వ్యవహారం ఆలయ అధికారుల దృష్టికి ఆదివారం రావడంతో సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువతి సోషల్ మీడియాలో ఈ ఒక్క వీడియోనే కాకుండా గతంలోనూ అనేక సార్లు ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం లోపల కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దుర్గగుడిలో వరసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆలయ భద్రతా లోపాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయంలోకి సెల్ఫోన్లతో ప్రవేశం లేదని దేవస్థానం పదే పదే ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆలయంలోకి సెల్ఫోన్లతో ప్రవేశించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


