జనసేన జిల్లా అధ్యక్ష పదవి నుంచి గాదె వెంకటేశ్వరరావును తప్పించేందుకు ప్రయత్నాలు తెలుగుదేశం ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించినందుకేనా? కాపులపై దాడులకు స్పందించడంతో పెమ్మసానికి ఎమ్మెల్యేల ఫిర్యాదు గాదె స్థానంలో బీసీ నేతకు అవకాశం జనసేనలో చర్చనీయాంశంగా జిల్లా అధ్యక్షుడి మార్పు వ్యవహారం
ఫిర్యాదుతోనే తొలగింపు?
సుగాలి ప్రీతి తల్లి ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు చేసినప్పుడు ఆ పార్టీ తరఫున స్పందించిన నాయకుడు ఆయన. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన కోసం నిలబడింది కూడా ఆయనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అవినీతిని, జనసేన పార్టీకి చెందిన కాపులపై జిల్లాలో జరుగుతున్న దాడులపై ప్రశ్నించడమే ఆయనకు శాపంగా మారింది. జనసేన జిల్లా అధ్యక్షునిగా ఉన్న గాదె వెంకటేశ్వరరావుకు ఉద్వాసన పలికి ఆయన స్థానంలో మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాసరావు, గంజి చిరంజీవిలలో ఒకరిని జిల్లా అధ్యక్షునిగా చేయాలని నిర్ణయించారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గాదె వెంకటేశ్వరరావు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే ఆయన జనసేన పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ జెండాను భుజాన మోస్తూ వచ్చారు. పార్టీ కోసం ఇప్పటి వరకూ జిల్లాలో నిలబడిన చరిత్ర ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మిర్చి యార్డు చైర్మన్ పదవి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. దాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కుర్రా అప్పారావుకు ఇచ్చారు. నామినెటేడ్ పదవుల్లో కూడా చోటు దక్కలేదు. అయినా అసంతృప్తి చెందకుండా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. అయితే ఇటీవల జనసేన పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తి మొదలైంది. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడులో కొంతమేర జనసేనకు సమాచారం ఇచ్చి చేసినా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పునర్విభజన ప్రక్రియలో కనీస సమాచారం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేను అడిగినా పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీనిపై గట్టిగా నిలదీశారు. గుంటూరు నగరంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో 28 రోడ్లు వేయాలని ప్రతిపాదనలు ఇవ్వగా, ఒక్కటీ ఆమోదించకపోవడంపై కూడా ఎమ్మెల్యేని నిలదీశారు. అంబటి రాంబాబుపై అక్రమలు కేసులు మోపి జైలులో పెట్టిన వ్యవహారంలో కూడా రాంబాబును జైలులో ఉంచడానికి జనసేన తరఫున తాను 2022లో ఇచ్చిన ఫిర్యాదును బయటకు తీసుకొచ్చారు. తమను ఇబ్బంది పెట్టారన్న భావన కూడా గాదె వెంకటేశ్వరరావులో ఉంది.
కాపు నేతలే లక్ష్యంగా...
ఓబులనాయుడుపాలెంలో చిన్నారి క్వారీ గుంతలో పడి మృతి చెందడంపై గాదె వెంకటేశ్వరరావు తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఇక్కడ ఉన్న అటవీ శాఖ భూముల్లో కూడా అక్రమ మైనింగ్ చేస్తుంటే అవినీతికి అలవాటు పడిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలా గాదె వెంకటేశ్వరరావు ప్రతి విషయాన్ని నిలదీస్తుండటాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెళ్లి కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. దీంతో ఆయన జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో గాదెను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల పట్ల జనసేనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.


