‘సాక్షి’ కథనంతో దిగివచ్చిన విద్యాశాఖ అధికారులు
గుంటూరు ఎడ్యుకేషన్: అకారణంగా ఉపాధ్యాయురాలిపై విధించిన సస్పెన్షన్ను గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీంబాషా వెనక్కి తీసుకున్నారు. ఉపాధ్యాయురాలికి జరిగిన అన్యాయంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం విద్యాశాఖలో కలకలం సృష్టించిన నేపథ్యంలో ఎట్టకేలకు క్షేత్ర స్థాయిలో విచారణ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఎత్తివేశారు. గుంటూరు బీఆర్ స్టేడియం ఎదుట ఉన్న మహాకవి తిక్కన – శ్రీ పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 23న మధ్యాహ్న భోజనం తనిఖీ చేసేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎం.డి.నసీర్ అహ్మద్ పథకంలో తలెత్తిన లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంఘటనతో సంబంధంలేని ఉపాధ్యాయురాలు సి.హెచ్.అరుణరాణిని మరుసటి రోజే డీఈఓ సస్పెండ్ చేశారు. విచారణ లేకుండా సస్పెండ్ చేసిన విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురించడంతో దిగి వచ్చిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ ఎత్తివేసి ఆమెను అదే పాఠశాలలో కొనసాగిస్తూ సోమవారం డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.


