నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతోపాటు సేవాభావం, సమానత్వం వంటివి పెంచేందుకు ప్రతి పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నరసింహారావు పేర్కొన్నారు. శుక్రవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రచార పోస్టరు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా నరసింహారావు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో యూనిట్ల ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో సమాజ సేవా దృక్పథం బలపడుతుందన్నారు. ప్రస్తుతం 935 పాఠశాలలకు రూ.50 వేల చొప్పున పీఎంశ్రీ నిధులు మంజూరు చేశారని, తద్వారా మౌలిక సదుపాయాల మెరుగుతోపాటు శిక్షణ కార్యకలాపాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో స్కౌట్స్ ఎస్ఓసీ పి.శ్రీనివాసరావు, ఎంఈవో జ్యోతికిరణ్, సహాయ కార్యదర్శి ఇ.అనిల్కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏఐబీఓసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను సమర్థించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ (ఏఐబీఓసీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శేషసాయి, జయకుమార్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకులను ప్రైవేటు పరం చేయటం వలన ఉద్యోగ భద్రత దెబ్బతినడంతో పాటు, కాంట్రాక్టు పనులు పెరగటం, ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు తగ్గుతాయన్నారు. ప్రజల నిధులు ప్రమాదంలో పడతాయని, దేశ ఆర్థిక సమగ్రత, సామాజిక ప్రయోజనాలపై దుష్ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ ప్రజలు, ఉద్యోగులు, రైతులు, పింఛన్దారులకు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ప్రైవేట్ బ్యాంకులు కేవలం లాభర్జన కోసమే పని చేస్తాయన్నారు. ఎలాంటి నిర్ణయం అయినా ప్రజా సంప్రదింపులు, పార్లమెంటరీ చర్చల ద్వారా నిర్వహించాలని కోరారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.
మేడికొండూరు: ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఒక డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని జంగంగుంట్ల పాలెం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గుంటూరు నుంచి సత్తెనపల్లి వైపు వెళుతున్న దోస్త్ లారీ, ఆదిలాబాద్ నుంచి చేబ్రోలు వెళుతున్న మరో లారీ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో పల్నాడు జిల్లా ముప్పాల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన దోస్త్ లారీ డ్రైవర్ కాలే ప్రసాద్ (23) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు.
నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదం


