
9 నుంచి శంకర్విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): శంకర్విలాస్ బ్రిడ్జిపై ఈ నెల 9 నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేసి కూల్చివేత పనులు చేపడుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, డెప్యూటీ మేయర్ షేక్ సజీల, అధికారులతో కలిసి నగరంలో జరుగుతున్న, చేపట్టనున్న అభివృద్ధి పనులపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.
● ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2 పిల్లర్స్ కాంక్రీట్ పూర్తి అయ్యాయని, ఈ నెల 9 నుంచి బ్రిడ్జి పై రాకపోకలు పూర్తిగా నిలిపేసి, కూల్చివేత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 135 స్ట్రక్చర్లు ఉండగా వాటిలో 74 మంది అంగీకారం తెలిపారని, వారికి నష్ట పరిహారం ఇచ్చి నిర్మాణాలు తొలగించామన్నారు.
● నందివెలుగు రోడ్లోని ఆర్ఓబీ పనులు 10 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయని, 8 నెలల గడువులో పూర్తి చేసేలా కాంట్రాక్టర్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని తెలిపారు.
● మణిహోటల్ సెంటర్లో కల్వర్ట్ నిర్మాణం చేయాల్సి ఉన్నందున ఆర్ అండ్ బి అధికారులు రెండు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసి, కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
● ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు ఈ నెల 7న టెండర్లు ఓపెన్ అవుతాయని, అనంతరం పనులు వేగంగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
● శారదాకాలనీ రోడ్, బ్రాడీపేట, నెహ్రూనగర్ రోడ్ల విస్తరణకు, ఎల్సీ నం.3 గేటు దగ్గర ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఆటో నగర్, అగతవరప్పాడులను కనెక్ట్ చేసేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
● పీవీకే నాయుడు మార్కెట్కు గతంలో చేసిన డిజైన్లు ఎవరికి నచ్చలేదు కనుక రివైజ్డ్ డిజైన్లను మేయర్, కమిషనర్, ఎమ్మేల్యేలు సంయుక్తంగా నిర్ణయించాలన్నారు.
● నల్లపాడు చెరువు, బొంగరాలబీడు కార్మిక శాఖ స్థలాలను నగరపాలక సంస్థకు కేటాయిస్తూ ప్రాథమిక ఆమోదం ప్రభుత్వం నుంచి అందాయి. అవి త్వరలో పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక కార్యాచరణ చేపడతామన్నారు.
● అసంపూర్తిగా ఉన్న గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ కాంట్రాక్టర్ని తొలగించి, నూతన కాంట్రాక్టర్కు పనులు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో మరమ్మతులకు గురైన రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు.
● శిథిలావస్థకు చేరిన బీఆర్ స్టేడియం రిజర్వాయర్ స్థానంలో రూ.2 కోట్లతో నూతన రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలో పనులు ప్రారభం కానున్నాయన్నారు.
● రెడ్డిపాలెం రోడ్ విస్తరణ గతంలో మాస్టర్ ప్లాన్కి భిన్నంగా జరిగినందున, సరిచేయాల్సి ఉందని, 3 వంతెనల వద్ద వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తున్నందున, శాశ్వత పరిష్కారం కోసం సుమారు 2 వందల ఆక్రమణలు తొలగించి, వారికి పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
● శారదా కాలనీ రోడ్ విస్తరణలో ప్రభావిత 22 మంది భవన యజమానులకు రూ.50.22 లక్షల నష్ట పరిహార చెక్కులను అందించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
కూల్చివేత పనులు ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్