
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు సాక్ష్యాలు అందజేత
తాడేపల్లి రూరల్: డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రజలను రెచ్చగొడుతూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడినట్లు సీఐ సాక్ష్యాలు అడగడంతో శనివారం నారాయణమూర్తి ఆ సాక్ష్యాల వీడియో ఫుటేజీని పెన్డ్రైవ్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా నాగ నారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు మాట్లాడుతూ... ‘పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తలతో చంపండి... నరకండి.. అది సివిలైజేషన్’ అంటూ రెచ్చగొట్టే విధంగా మట్లాడారని చెప్పారు. సీఐకి సాక్ష్యాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, వి.రవీంద్రారెడ్డి, బి.నరేంద్ర సింగ్, ఎస్కే జావీద్ బాషా, హాసన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మూడు మండలాలకు ఎంఈవో–1లుగా అదనపు బాధ్యతలపై నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. గుంటూరు వెస్ట్ ఎంఈవో–1గా గుంటూరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం పి.హవీలా, పెదకాకాని ఎంఈవో–1గా గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం బీవీ రమణయ్య, చేబ్రోలు ఎంఈవో–1గా చేబ్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆర్. చలపతిరావును పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి శనివారం నియమించారు.