
తవ్వుకో.. అమ్ముకో !
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
వే బిల్లులు లేకుండా మట్టి తరలిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద లారీల అనుమతి కోసం ఏఎంఆర్ సంస్థ ఇచ్చే బిల్లులు మాత్రమే చూపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ తంతుపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడు ట్రాక్టరు మట్టి తరలించాలంటే సవాలక్ష ఆంక్షలు విధించే అధికారులు ముడుపులు తీసుకుని మట్టి దందాకు సహకరిస్తున్నారని ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి రాజధాని ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న షాడోలపై చర్యలు తీసుకొని, ప్రజాధనం పరుల పాలు కాకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పేదల భూముల్లో అధికార పార్టీ పెద్దలు అక్రమ మట్టి తవ్వకాలకు తెరలేపారు. రాజధాని పనుల కోసం అంటూ సాకు చెబుతున్నారు. దీనికి అధికార పార్టీ నేతలు అండగా నిలబడటం ఫిరంగింపురం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉండి అన్ని తానై చక్రం తిప్పుతున్న షాడో ఈ దందాకు తెరలేపినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఫిరంగిపురం మండలంలో మూడు గ్రామాల్లో గ్రావెల్ దందా జరుగుతోంది. మండలంలోని అమీనాబాద్, పొనుగుపాడు, 113 తాళ్లూరు గ్రామాల్లో తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి.
వందలాది లారీల్లో తరలింపు
ప్రధానంగా ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామ కొండ ప్రాంతంలో పేదలకిచ్చిన డీకే పట్టా భూముల్లో కొద్ది రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రింబవళ్లు రెండు జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. వందలాది లారీలలో గ్రావెల్ను తరలించి జేబులు నింపుకుంటున్నారు. రాజధాని నేపథ్యంలో నిర్మాణాలు ఊపందుకోవడంతో గ్రావెల్కు మంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేత తనదైన శైలిలో పావులు కదిపాడు. ఒక కాంట్రాక్టర్ను ముందు పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా జోరుగా మట్టిని తరలించి దోపిడీకి తెరలేపాడు. సాధారణంగా మట్టి తవ్వకాలు జరపాలంటే కొండ పోరంబోకులో అయితే ఎలాంటి అనుమతులు ఉండవు. సాధారణ భూముల్లో అయితే గ్రామ పంచాయతీతో పాటు మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ ఇతర అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం పేదలకిచ్చిన డీకే పట్టాల భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతుండటం విశేషం.
40 ఏళ్ల కిందట పేదలకు డీకే పట్టాలు.
అమీనాబాద్ కొండ ప్రాంతంలో పేదలకు 40 ఏళ్ల కిందట సర్వే నెంబర్ 545–19లో డీకే పట్టాలను ప్రభుత్వం జారీ చేసింది. ఒక్కొక్కరికీ 50 సెంట్లు భూమిని ఇచ్చింది. అయితే, నీటి వసతి లేని కారణంగా అవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటిపై మట్టి మాఫియా కన్ను పడింది. అనుకున్నదే తడువుగా సదరు షాడో పావులు కదిపాడు. పేదల భూముల్లో అక్రమ తవ్వకాలకు లైన్క్లియర్ చేసి తవ్వకాలు చేపట్టాడు. అతని ప్రధాన అనుచరుడైన వ్యక్తిని కాంట్రాక్టర్గా ప్రచారం చేశాడు. రాజధాని నిర్మాణాలకు ప్రభుత్వం తరలిస్తుందంటూ దందాకు భారీగా తెరలేపాడు.
సీనరేజీ రూపంలో వసూళ్ల దందా
సీనరేజీ రూపంలో ఒక్కో డంపర్ లారీకి రూ.4500 వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి రూ.11 వేల నుంచి రూ. 15 వేల వసూలు చేస్తూ, జిల్లా నలుమూలలకు గ్రావెల్ను తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా పేదలకిచ్చిన డీకే పట్టా భూముల్లో మట్టి దందాకు తెరలేపడంపై స్థానికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమ ప్రజా ప్రతినిధికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వస్తున్నాయని అధికార పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు.
ఫిరంగిపురం మండలంఅమీనాబాద్లో టీడీపీ నేతల దందా పేదలకిచ్చిన డీకే పట్టా భూముల్లో జేసీబీలతో రాత్రింబవళ్లు తవ్వకాలు డంపర్ల ద్వారా తరలింపునకు భారీగా వసూళ్లు లోడింగ్కు సీనరేజీ రూపంలో రూ.4500 వసూలు
రాజధానికి మట్టి తరలింపు
రాజధాని ప్రాంతానికి మట్టిని తరలిస్తున్నారని, ఉన్నతస్థాయిలో చెప్పడం వల్లనే తవ్వకాలు జరుగుతున్నాయి.
–జె.ప్రసాదరావు, తహసీల్దార్