
యోగాతో ఆరోగ్య పరిరక్షణ
గుంటూరు వెస్ట్: ప్రజల ఆరోగ్య సంపద పరిరక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం యోగాంధ్ర –2025 ద్వారా యోగాపై విస్తృత అవగాహన కల్పిస్తోందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్తో పాటు, శాసనసభ్యులు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రాష్ట్ర ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డెప్యూటీ మేయర్ షేక్ షజీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 5,130 ప్రాంతాల్లో యోగాసనాల కార్యక్రమం నిర్వహించామన్నారు. దీని కోసం మాస్టర్ ట్రైనర్స్ను, సచివాలయ స్థాయిలో ఐదువేల మందిని ఎంపిక చేసి ఎనిమిది లక్షల మందికి మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని వివరించారు. నెల రోజుల పాటు సాగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. యోగా సాధన నిత్యం చేయాలని ఆమె విద్యార్థులకు సూచించారు. యోగా గురువు పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల ఆసనాల నిర్మాణాలను ఆవిష్కరించారు. యోగాసనాల కార్యక్రమంలో ఐదు వేల మంది విద్యార్థులు, పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి