
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: పాలిసెట్–2025 కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. గుంటూరు నగర శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రంలో సమన్వయకర్త టి. శేఖర్ పర్యవేక్షణలో సిబ్బంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. శనివారం ఒకటో ర్యాంకు నుంచి 15వేలు ర్యాంకు వరకు పూర్తయింది. ఆదివారం 15,001 నుంచి 32వేలు వరకు ర్యాంకు విద్యార్థులు హాజరుకావాలి. ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ పాత క్యాంపస్, రేపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, బాపట్లలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాల్లోనూ విద్యార్థులు ఆయా తేదీల్లో ర్యాంకులు వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని అధికారులు సూచించారు.
నేడు పూలింగ్ సమాయత్త సభలు
తాడికొండ: తాడికొండ మండలంలో పూలింగ్ కింద భూమి సేకరించేందుకు ఆదివారం సమాయత్త సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దారు మెహర్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మోతడక, 11 గంటలకు లచ్చన్నగుడిపూడి, 12 గంటలకు ముక్కామల గ్రామాల్లో సభలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్తో పాటు, స్థానిక అధికారులు, సీఆర్డీఏ అధికారులు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు