దేశ శ్రేయస్సుకు మార్పు అనివార్యం

Varre Venkateswarlu Write on BRS Khammam Meeting, Telangana Model - Sakshi

సందర్భం

భారతదేశం మతపరమైన చట్టాలు, మత బోధనల చట్రంలో ఇరుక్కోని సర్వ సత్తాక లౌకిక శ్రేయో రాజ్యం. ప్రపంచంలోనే అత్యంత బలమైన పునాదులతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రజాస్వామిక దేశం. నిజమే! కానీ ఇప్పుడు అధికారం కోసం లౌకికవాదానికి తూట్లు పొడిచే ఎత్తుగడలు దేశ లౌకికతత్వంతో పాటు సమాఖ్య స్పూర్తికీ పెను ముప్పుగా నిలువ బోతున్నాయి. 

మతం పేరుతో, కులం పేరుతో దేశాన్ని విడగొట్టే యత్నాలతో వచ్చే సాధారణ ఎన్నికలకు రాజకీయ  పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటు న్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆధ్వ ర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ ఎస్‌) జాతీయ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్‌)గా మారి దేశ ఎన్ని కల రణ క్షేత్రంలో దూకుతోంది. కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో వచ్చే ఎన్నికలకు వెళతామని ఖమ్మం సభలో ప్రకటించటం ఆయా వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

ప్రాజెక్టులు పచ్చగా మార్చాయి
దేశంలో వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్‌ సృష్టించిన కల్లోలంతో ప్రపంచ దేశాలన్నీ అతలాకు తలమయ్యాయి. పలు రంగాలు పూర్తిగా దెబ్బతిని ప్రభుత్వాలు నడవడం దుర్లభం అయిపోయింది. కానీ తెలంగాణలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న సమ్మిళిత అభివృద్ధి పథకాలు తెలంగాణ ను కోవిడ్‌ నష్టం నుండి తొందరగానే విముక్తం చేశాయి. 

పారిశ్రామిక రంగం కాస్త దెబ్బతిన్నా... వ్యవ సాయ రంగం మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధించింది. అందుకు కారణం... సమృద్ధి వర్షాలతో సముద్రం పాలయ్యే నీటిని బీడు భూములకు మళ్లించటమే. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌... నిరంతరం కరువుతో నకనక లాడే ఉత్తర తెలంగాణను ఇప్పుడు పచ్చని సీమగా మార్చింది. ‘మిషన్‌ కాకతీయ’ పాడుపడిన పల్లెల్లో కొత్త కళను తెచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో 2021– 22లో 378 శాతం వరి ఉత్పత్తి పెరిగి తెలంగాణ ఇప్పుడు ‘రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా రూపాంతరం చెందింది. 

పత్తి ఉత్పత్తి 61 శాతం పెరిగి తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో కీలకంగా మారింది. 2020–21లో తెలంగాణ వ్యవసాయం – అనుబంధ రంగాల అదనపు స్థూల విలువ 9.09 శాతం వృద్ధిని సాధించింది. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నది. పండిన పంటను మద్దతు ధరతో కొనుగోలు కూడా చేస్తున్నది. 

సమాఖ్య స్ఫూర్తి చెదరకుండా...
ఇక విద్య, వైద్యంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి మిషన్‌ భగీరథతో నూటికి నూరుశాతం గ్రామాలకు రక్షిత మంచినీళ్లందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ముందడుగు వేసింది. ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్‌ అభివృద్ధి సంక్షేమం కావాలంటే, వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరించా లని కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును దేశం ఆసక్తిగానే గమనిస్తున్నది. 

ఇదే సభలో పాల్గొన్న కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు సైతం దేశ సమాఖ్య స్పూర్తికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక ప్రజలపైనే ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై ఇప్పటికే కేంద్రం అంతర్గత భద్రత, వ్యవసాయ, సహకారం, విద్యుత్‌ తదితర అంశాలపై రాష్ట్రాలతో చర్చించకుండానే చట్టాలను చేసుకుపోతోంది. 

అలాగే మరోవైపు రాష్ట్రాలు చేస్తున్న శాసనాలను గవర్నర్‌లతో నియంత్రించే ప్రయత్నాలు చేస్తు న్నది. ఈ తీరు భారత సమాఖ్య స్పూర్తికి భంగం కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో అనేక జాతులు, మతాలు, భాషలు, కులాలు, జీవన విధానాలూ ఉన్న సువిశాల భారత దేశ ‘భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి’ని ముందుకు తీసుకు వెళ్లడం ఇప్పుడు అత్యవసరం. 

ఈ విధిని నిర్వహించడంతో పాటూ... సమాఖ్య స్పూర్తికి దెబ్బ తగలకుండా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అజెండా దేశమంతా విస్తరించాలంటే ఒక్కసారి భారత రాష్ట్ర సమితికి అవకాశం ఇచ్చి చూడాలి. మతం, కులం పేరుతో రాజకీయాలు చేసే చోట అభివృద్ధి–సంక్షేమంతో వచ్చే గుణాత్మక మార్పుతోనే లౌకిక స్ఫూర్తికి కొత్త శక్తి వస్తుంది. (క్లిక్ చేయండి: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!)


- డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top