
అభిప్రాయం
స్వతంత్ర భారతావని చరిత్రలో 1975 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ పాలనలో అధికార దుర్వినియోగం జరిగింది. ప్రజాస్వామిక హక్కు లను కాలరాచారు. ప్రతిపక్షాల నిరసన గళాన్ని నొక్కేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. నాటి దుశ్చర్యలను పాలక పక్షం వల్లె వేస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ వాటిని తిరస్కరించగలదా? లేదు. అందుకే ‘‘మరి మీ మాటేమిటి? అంతకంటే ఎక్కువగానే మీరు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిస్తున్నారు కదా’’ అంటూ ఎదురు దాడికి దిగుతోంది. ఈ దూషణల హోరులో ఆ భయానక దుర్ఘటనల నుంచి నేర్వాల్సిన పాఠాలు కొండెక్కే ప్రమాదం ఉంది.
జైలు అనుభవాలు
ఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రతా నిర్వహణ చట్టం కింద 34,988 మంది, భారత రక్షణ చట్టం, నిబంధనల కింద 75,818 మంది అరెస్ట్ అయ్యారు. తమిళ నాడు కేడర్లో నేనప్పుడు 30 ఏళ్ల జూని యర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నాను. ఆకస్మి కంగా నన్ను నేనే జైల్లో వేసుకున్నట్లు ఫీల్ అయ్యాను. నా ఆలోచనలు మనసు లోనే బందీ అయ్యాయి.
దేశ అత్యున్నత నేత జయప్రకాశ్ నారాయణ్ను తెల్లవారక ముందే మూడింటికి నిద్రలేపి జైలుకు తరలించారు. ఆ సమయంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏమిటో తెలుసా? ‘వినాశ కాలే విపరీత బుద్ధి’!
మొరార్జీ దేశాయి, వాజ్పేయి, అడ్వాణీ, చరణ్ సింగ్, చంద్రశేఖర్ వంటి జాతీయ నాయకులను లోపల వేశారు. అప్పటి సీపీఎం విద్యార్థి నాయకులు ప్రకాశ్ కారత్, సీతారామ్ ఏచూరి, బీజేపీ అరుణ్ జైట్లీలనూ ఊచలు లెక్కపెట్టించారు. ఆ తర్వాత కొద్ది నెలలకు, అజ్ఞాతంలో ఉన్న జార్జి ఫెర్నాండెజ్ను పట్టుకున్నారు. ఆయన మద్దతుదారు స్నేహలతారెడ్డిని జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. పెరోలు మీద బయటకు వచ్చిన కొద్ది కాలంలోనే ఆమె చనిపోయారు. జైలు అనేది రాజ్యపు అత్యంత వికృత పార్శ్వం. ఇవన్నీ చూశాక ఈ భావన నాలో మరింత బలపడింది.
నేను నా ఐఏఎస్ కెరీర్లో కలెక్టర్గా ఎప్పుడూ పనిచేయలేదు. దాంతో కారాగారాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలగలేదు. జైళ్ల స్థితిగతులను స్వయంగా తెలుసుకోవాల్సిందిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఓసారి రాష్ట్రాల గవర్నర్లను కోరారు. నేరస్థుల దిద్దుబాటు గృహం (జైలు) ఎలా ఉంటుందో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్న ఆ సమయంలో తెలుసుకున్నాను.
ఒక జైలును చూడ్డానికి వెళ్లినప్పుడు, గడ్డం పెంచుకున్న ఓ యువకుడు నా దగ్గరకు వచ్చి హిందూస్థానీలో మాట్లాడాడు. ‘‘హుజూర్! నేను పాకిస్తాన్ వాడిని. నేను ఒక మొక్కు తీర్చుకోడానికి అజ్మీర్ షరీఫ్కు వెళ్లాలనుకున్నాను. నేను చేసిన పొరబాటల్లా ఒంటరిగా బయలు దేరడమే. దాంతో నన్ను టెర్రరిస్టుగా అనుమానించి నిర్బంధంలోకి తీసుకున్నారు.
నేను మిమ్మల్ని ఏదీ కోరను, ఏ ఫిర్యాదూ చేయను. మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఈ జైల్లో పెట్టి ఇండియా నాకు మేలు చేసింది. ఇక్కడి లైబ్రరీలో నాకు పవిత్ర ఖురాన్ కనిపించింది. మొదటిసారి నేను ఖురాన్ మొత్తం చదివాను.’’ అతడికి ఏం బదులు చెప్పాలో అర్థం కాలేదు. వ్యంగ్యంగా అంటున్నాడా? నిజంగానే మెచ్చుకోలుగా అంటున్నాడా? ఎలా అయినా అతడు పూర్తి మేధావి.
మరో దిద్దుబాటు గృహం సందర్శించాను. అక్కడి నుంచి వెనుదిరుగుతుండగా, కట్నం చావుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వృద్ధురాలు కనబడింది. ఆమెను, అక్కడి ‘పాగల్ వార్డు’ను చూసి చలించి పోయాను. ఇంతలో అందులోని ఓ బెంగాలీ యువకుడు నన్ను ఆపి, ‘‘ఇక్కడ మాకు లైబ్రరీ ఉంది.
దానికి మంచి పుస్తకాలు పంపించండి’’ అని అడిగాడు. మరోచోట, ‘‘సర్! ఒక్కరోజు ఇక్కడ టీవీ పెట్టించండి, వింబుల్డన్ ఓపెన్ చూస్తాం’’ అంటూ ప్రాధేయపడ్డారు. వారి కోరిక తీరింది. వారిలో హంతకులు, రేపిస్టులు, దొంగలు కూడా ఉంటారు. కానీ ఆ ఒక్కరోజు వాళ్లూ మనలాగే రఫేల్ నాదల్, రోజర్ ఫెదరర్ ఫ్యాన్లుగా మారి ఆనందించారు.
కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి!
నేడు ఇండియలో ఎమర్జెన్సీ లేదు. కానీ జైలు అనే ‘హారర్ ఆఫ్ ది హారర్స్’ ఉంది. ఇది బాధా కరమైన వాస్తవం కాదా? ఇవ్వాళ మాత్రం ఇండియాలో రాజకీయ నిర్బంధితులు లేరా? మన రాజకీయ ఆర్థిక వ్యవస్థలో జైలు అనే ముప్పు ఇప్పటికీ పొంచి ఉందా లేదా? ఈ సమయంలో మనం రాజ కీయాలు చేయడం కంటే, చరిత్రను గౌరవించడం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీకి ఇదొక సువర్ణావకాశం. నాటి మానవ హక్కుల, రాజకీయ సంప్రదాయాల, న్యాయ విధానాల అతిక్రమణలు అన్నింటికీ ఆ పార్టీ సుస్పష్టంగా క్షమాపణ కోరాలి.
ఎమర్జెన్సీ కాలంలో చెరసాల పాలైన వారిలో ఇప్పటికీ జీవించి ఉన్నవారిలో వయసులో పెద్దవాడు అడ్వాణీజీ. కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన్ని కలిసి వ్యక్తిగత క్షమాపణ చెప్పాలని అనుకోవడంలో తప్పేమైనా ఉందా? అలాగే ప్రభుత్వానికీ ఇది సువర్ణావకాశం. ఎమర్జెన్సీ భయానక ఘటనలను వల్లె వేయడం కంటే మించినది ఏదైనా తలపెట్టాలి. ఈ సందర్భంగా ‘రాజకీయ ఖైదీ’లను విడుదల చేయాలి. హింస, ద్వేషాలను రెచ్చగొట్టక పోయినా కేవలం రాజకీయ అభిప్రా యాల కారణంగా ఇక మీదట నిర్బంధించబోమని ప్రకటించాలి. తద్వారా, భారత శిక్షాచరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాలి.
అంతకంటే మించిన అంశం: విచారణ కోసం ఎదురు చూస్తూ జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలను వారికి పడే గరిష్ఠ శిక్షలో సగం కాలం పూర్తి చేసుకున్నట్లయితే (మరణ శిక్ష విధించదగిన నేరాభియోగాలు ఉన్న వారిని మినహాయించి), నేర శిక్షాస్మృతి 436ఎ సెక్షన్ (భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని 479 సెక్షన్)ను సవరించి వారిని విడుదల చేయాలి.
గోపాలకృష్ణ గాంధీ
వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారత చరిత్ర విద్యార్థి
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)