ప్రశ్నించే గొంతుకపై 'ఉక్కుపాదం' | Sakshi Guest Column On Chandrababu Naidu coalition govt | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే గొంతుకపై 'ఉక్కుపాదం'

May 28 2026 5:22 AM | Updated on May 28 2026 5:22 AM

Sakshi Guest Column On Chandrababu Naidu coalition govt

‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రా యాన్ని నిర్భయంగా చెప్పే నీ హక్కును నా ప్రాణం అడ్డుపెట్టయినా కాపాడు తాను‘ అన్న ఫ్రెంచ్‌ తత్వవేత్త వోల్టెయిర్‌ ప్రసిద్ధ సూక్తి ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యావేత్తగా, పాత్రికేయుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా, రాజకీయ విశ్లేషకుడిగా కోట్లాది మంది ప్రజల గౌరవాన్ని చూరగొన్న వ్యక్తి ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఆయనపై వరుసగా కేసులు నమోదు కావడం, కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చే మీడియా సంస్థలు ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక వ్యక్తిపై జరుగు తున్న దాడి కాదు, ప్రశ్నించే గొంతుకను చిదిమేయడా నికి జరుగుతున్న కుట్రగా భావించాలి. ఒక పాత్రికేయుడిగా తనకు అందుబాటులో ఉన్న సోర్సులను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న రాజకీయ పరిణామాలను బయటపెట్టినందుకు ఆయనపై పగబట్టడం పాలకుల అహేతుక వైఖరిని వెల్లడిస్తోంది.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన కీలకమైన హక్కు ‘భావప్రకటన స్వేచ్ఛ’. ఒక జర్నలిస్టుగా సమాజంలో జరుగుతున్న పరిణామాలను, తెరవెనుక రాజకీయాలను ప్రజల ముందుకు తేవడం ఆయన ప్రాథమిక బాధ్యత. ఒక క్లోజ్డ్‌ డోర్‌ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మధ్య జరిగిన సంభాషణ గురించి నాగేశ్వర్‌ ప్రస్తావించడంపై ఇంత రగడ సృష్టించడం అర్థరహితం. రాజకీయాల్లో ఇటువంటి సంభాషణలు సన్నిహిత వర్గాల ద్వారా లేదా అంతర్గత లీకుల ద్వారా సీని యర్‌ జర్నలిస్టులకు చేరడం అత్యంత సహజమైన ప్రక్రియ. జర్నలిజం నిబంధనల ప్రకారం తమకు సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఏ పాత్రికేయుడికీ లేదు. నమ్మదగిన సోర్స్‌ ద్వారా సమాచారం అందిన ప్పుడే బహిరంగంగా మాట్లాడతారు. 

ఒకవేళ నాగేశ్వర్‌ చెప్పిన విషయాల్లో నిజం లేకపోతే, అసలు వారి మధ్య ఏం సంభాషణ జరి గిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉప ముఖ్య మంత్రిపై ఉంటుంది. కనీసం ఆ వార్తలను ప్రజా స్వామ్య యుతంగా ఖండించే అవకాశం కూడా వారికి ఉంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ సరళ మైన, ప్రజాస్వామ్య మార్గాన్ని వదిలిపెట్టి, భయ బ్రాంతులకు గురిచేసే వ్యూహాన్ని ఎంచుకుంది. ‘మమ్మల్ని ప్రశ్నిస్తే సహించేది లేదు’ అనే అర్థం వచ్చేలా సాగుతున్న ఈ వైఖరి ఒక ప్రమాదక రమైన సంస్కృతికి భాష్యం చెబుతోంది.

ఒకసారి చరిత్రను చూస్తే...
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో కార్టూనిస్ట్‌ శంకర్‌ పిళ్లై అప్పట్లో ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూపై, ఆయన ప్రభుత్వ విధానాలపై పదునైన వ్యంగ్య కార్టూన్లు గీసేవారు. వాటిని చూసి నెహ్రూ ఎన్నడూ ఆగ్రహించలేదు. ‘శంకర్, నన్ను కూడా వదలకు’ అంటూ ప్రోత్సహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ తనపై వచ్చిన పత్రికా విమర్శలను, వ్యక్తిగత దూషణలను ఓపికతో భరించారు. ‘నన్ను విమ ర్శించే హక్కు పత్రికలకు ఉంది, నా తప్పులను నేను సరిదిద్దుకునే అవకాశం వాటి ద్వారా దక్కుతుంది’ అని ఆయన నమ్మారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న చర్చిల్‌పై మీడియా, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. యుద్ధ వ్యూహాల లీకేజీలపై కథనాలు వచ్చినా, ఆయన పాత్రికేయులపై కేసులు పెట్టలేదు. ‘సజీ వంగా ఉన్న ప్రజాస్వామ్యానికి విమర్శే ప్రాణా ధారం’ అని ప్రకటించారు. ఈ చారిత్రక ఉదాహరణలతో పోల్చితే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ పాలకులు ఎంత అసహనంతో ఉన్నారో స్పష్టమవుతుంది.
– ఎం. కృష్ణ ఆదిత్య ‘ పాత్రికేయుడు 

Advertisement
 
Advertisement
Advertisement