
సామాన్య, పేద, మద్యతరగతి ప్రజలకు వారసంతలు బిగ్ మార్ట్లయ్యాయి. మరోవిధంగా చెప్పాలంటే.. ఉన్న ఊరులోకే నడిచే వచ్చే మొబైల్ మార్ట్లుగా మారాయి. ఇక్కడ నిత్యావసరాలు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మసాలా, కూరగాయల విత్తనాలు, టమాట, వంకాయ, ఉల్లినారు, నువ్వులు, పెసలు, బబ్బెర్లు, అలసందలు, పసుపు, కొన్నిరకాల డిష్వాష్, డిటర్జెంట్ పౌడర్లు, సబ్బులు, చింతపండు, కారప్పొడి, ఎండు మిరపకాయలు, టీ పైడర్ ఇలా ఒక్కటేమిటీ.. అన్నిరకాల దుస్తులూ చవకగా లభిస్తున్నాయి.
గతంలో మండల కేంద్రాల్లోనే జరిగే వారసంతలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారు నాలుగు వరకు అనుబంధ గ్రామాలు ఉంటున్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే వారసంతలో తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖని, వరంగల్, జమ్మికుంట, పరకాల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర దూర ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఊరూరా మొబైల్ మార్ట్లు..
సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలకు మొబైల్ మార్ట్లుగా రూపాంతరం చెందిన వారసంతలు.. ఇప్పుడు ఒక్కోగ్రామంలో ఒక్కోవారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అటు వినియోగదారులకు, ఇటు చిరువ్యాపారులకు ఇవిఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వ్యాపారులకు ఉపాధి, వినియోగదారులకు బడ్జెట్ ధరల్లోనే అవసరమైన సరుకులు లభ్య మవుతున్నాయి.
పంచాయతీలకూ ఆదాయం
ఆయా గ్రామాల్లో నిర్వహించే వారసంత(మొబైల్ మార్ట్)ల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం కూడా సమకూరుతోంది. ఒక్కో దుకాణ నిర్వాహకుడి(చిరు వ్యాపారి) నుంచి కనీసం రూ.20 నుంచి రూ.100 వరకు రుసుం వసూలు చేస్తున్నారు గ్రామపంచాయతీ సిబ్బంది.
చాలామందికి ఉసాధి
వారసంతలో వ్యాపారుల నుంచి నిర్వహణ రుసుం(చిట్టి) వసూలు చేసుకునేందుకు గ్రామానికి చెందిన పలువురు వ్యాపారులు.. ఏడాదిపాటు అనుమతి కోసం రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు బహిరంగ వేలం ద్వారా అనుమతి పొందుతున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు 600 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.
(చదవండి: దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..!)