జపాన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది ‘సుషీ’.. ఆ ఫుడ్ ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఆదరణ పొందుతోంది. ఆ రుచి కొన్నేళ్లుగా నగరవాసులను ఆకట్టుకుంటోంది. దేశంలో సుషీ ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం మనది బియ్యం ఉత్పత్తి చేసే ప్రధాన దేశం కావడం. అలాగే చేపలు తినే సంస్కృతితో విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం అని ఎగ్జిక్యూటివ్ చెఫ్ స్వప్నదీప్ ముఖర్జీ చెప్పారు. 1990లలో ఆర్థిక సంస్కరణల సమయంలో మనం విదేశీ కంపెనీలకు తలుపులు తెరిచినప్పుడు, చాలా మంది జపనీస్, కొరియన్ ఇతర దేశాల నుంచి ప్రజలు మన దేశానికి వచ్చారు. ఇది మన దేశంలో అంతర్జాతీయ ప్రమాణాల జపనీస్ ఆహారం కోసం డిమాండ్ను పెంచింది. తద్వారా మరిన్ని జపనీస్ అవుట్లెట్లు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. నేటి ‘మన జపనీస్ వంటకాల అభిరుచులకు ఊపిరిలూదింది ఢిల్లీలోని మెట్రోపాలిటన్ హోటల్ స్పాలో ‘సకురా’ రెస్టారెంట్. తర్వాత అలా అలా అన్ని నగరాలకు విస్తరించింది. విస్తృత శ్రేణి భారతీయ పాలెట్ ప్రకారం సుషీ మార్పుచేర్పులకు లోనవుతోంది. ఆచారి సుషీ, పనీర్ టిక్కా సుషీ, జైన్ సుషీ, అరబిక్ సుషీ వంటి విభిన్న పేర్లతో మమేకమైంది. సుషీ కేవలం పచ్చి చేప మాత్రమే కాదని, ఇది చాలా సూక్ష్మంగా ఉండే క్రమశిక్షణ కలిగిన క్రాఫ్ట్ అని ప్రజలు అర్థం చేసుకోవడానికి పెరిగిన ఎక్స్పోజర్ సహాయపడింది.
నగరానికి దశాబ్దాల క్రితమే పరిచయమై నానాటికీ డిమాండ్ పెంచుకుంటున్న వంటకం సుషి. సిటీలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో పుష్కలమైన ప్రోటీన్లను అందించేదిగా పేరున్న ‘సుషి’ డిమాండ్ కూడా ఊపందుకుంది. జపనీయులు ఆరోగ్య వంతులుగా ఉండటానికి అక్కడి వండేశైలి ప్రధాన కారణమనేది జగమెరిగిన సత్యం.
రా ఫిష్, వెజిటబుల్స్, రైస్లతో కేవలం 30శాతం మాత్రమే కొవ్వు పదార్థాలు ఉండే సుషీ అధికంగా తినడం వల్లనే అక్కడ గుండె జబ్బులు ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలకన్నా చాలా తక్కువగా ఉన్నాయని, అలాగే రైస్, రాఫిష్తో కలగలిపిన సుషి కర్రీ.. లంగ్ కేన్సర్లు రాకుండా కూడా నివారిస్తోందని పాకశాస్త్ర నిపుణుల విశ్లేషణ.
ఫినిష్.. అనారోగ్యం..
ఈ సంప్రదాయ జపనీస్ వంటకాన్ని ముడి చేప, బియ్యం,
సాధారణంగా రెండు పదార్థాలతో తయారు చేస్తారు. దీనిలో వాడే వినెగర్డ్ రైస్ను సముద్ర ఆహారం, కూరగాయలు నుంచి మాంసం వరకు పలు పదార్థాలతో కలపవచ్చు. సుషి, టెంపురా, సాషి్మ.. వగైరా వంటకాల ద్వారా ప్రతి జపనీయుడు రోజుకు 100 గ్రాముల చేపల్ని ఆహారంలో భాగం చేస్తాడట. చేపల్లో ఉండే ఒమెగా–3 యాసిడ్స్ గుండెకు రక్షణ అందిస్తాయి.
ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ టొషిరో ట్యాకెజకి ఏమంటారంటే.. ‘జపనీస్కి తాజా చేప అంటే చాలా ఇష్టం.. సుషిలో రాఫిష్ ప్రధాన భాగం. అందుకే యుకె లాగే ఇక్కడ కూడా బాగా పొగతాగే అలవాటు ఉన్నప్పటికీ లంగ్ కేన్సర్ మాత్రం అక్కడితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది’ అని జపనీయులు పరిచయం చేసిన ఆహార పదార్థం సుషి.
సిటీలో ఎక్కడంటే..
వండటం అనే ప్రక్రియకు చాలా వరకూ దూరంగా ఉంటుంది కాబట్టి ఇది దాదాపుగా రా డిష్ అనే చెప్పాలి. ఉడకబెట్టిన ఏదైనా రైస్ వెరైటీని సముద్రపు ఆకుల్లో చుట్టి ఫిష్, మటన్, చికెన్, రొయ్యలు లేదా కూరగాయలు గానీ కలిపి రోల్ చేస్తారు. (జపనీస్ కేవలం చేపలు మాత్రమే వినియోగిస్తారు) అనంతరం తగిన ఫ్లేవర్లు అద్ది సర్వ్ చేస్తారు. దీనికి సపోర్ట్గా సాసెస్ కూడా ఉంటాయి.
సుషితో పాటు తరచూ సర్వ్ చేసే వ్యాసబీ అనే గ్రీన్ పేస్ట్లో ఉండే ఇసొతైసైనేట్స్ పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టి, రక్తం గడ్డకట్టుకుపోయే పరిస్థితుల్ని కూడా నివారిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. సుషికి అదనపు రుచిని అందించే ఫ్లేవర్లలో ఒకటైన అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సుషిని టేస్ట్ చేయాలంటే.. కోకాపేట్లోని కోకోకాయి.
జూబ్లీహిల్స్లోని అర్బన్ ఏషియా, యూమీ, నోహో, హైటెక్ సిటీలోని కోకో, బంజారాహిల్స్లోని హిడెన్ లీఫ్, మాదాపూర్లోని మోషె, జూబ్లీహిల్స్లోని మాకో బ్రూ కేఫ్ అండ్ రెస్టారెంట్.. తదితర రెస్టారెంట్స్కు ఓ రౌండ్ కొట్టాల్సిందే. లేదా స్టార్ హోటల్స్లో ప్రత్యేకంగా ఏర్పాటయ్యే థాయ్, చైనీస్ రెస్టారెంట్లను సందర్శించాలి.


