తమిళ సినిమా ఐకాన్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కుర్రహారోల మాదిరిగా అంతే ఫిట్గా ఉండటమే కాదు, స్టైలిష్గా డ్యాన్స్లు కూడా చేస్తుంటారు. ఏడు పదుల వయసులోనూ అంతే స్ట్రాంగ్ పర్సనాలిటి మెయింటైన్ చేస్తున్న సూపర్స్టార్ డైట్ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు ఒక చెన్నై డాక్టర్ రజనీ డైట్ గురించి వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా ఇషేర్ చేశారు. మరి ఇవాళ (డిసెంబర్ 12) రజనీకాంత్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆరోగ్య రహాస్యాలు, డైట్ ఎలా ఉంటుంది వంటి వాటి గురించి ఆ డాక్టర్ మాటల్లోనే తెలుసుకుందామా.
చెన్నై బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని రజనీ ఆరోగ్య రహస్యం గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన ఐదు తెల్లటి ఆహారాలను నివారించడం వల్ల ఇంతలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నారని అన్నారామె. ఉప్పు, చక్కెర, మైదా, పాలు, పెరుగు అతిగా తీసుకుంటే వాపు, ఇన్సులిన్ స్పైక్లు, ఆమ్లత్వం, గట్ సమస్యలకు దోహదం చేస్తాయి. అలాగే ఆయన మంచి పోషకవంతమైన ఆహారం తోపాటు రోజువారీ వ్యాయామాలు, ధ్యానం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయని అన్నారు.
అలాగే డాక్టర్ మృణాళిని రజనీ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు పంచుకుంటూ..మన సూపర్ స్టార్ రజనీకాంత్ 74 సంవత్సరాల వయస్సులో కూడా చాలా అందంగా నృత్యం చేస్తున్నారు కదా..!. దానికి కారణం ఏంటో తెలుసా..అంటూ ఆయనే స్వయంగా తాను ఎలాంటి ఆహారం తీసుకుంటాననేది చెబుతున్న వీడియోని కూడా ఆమె జోడించారు. ఆ వీడియోలో రజనీకాంత్ స్వయంగా తాను తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటానని అన్నారు. అవేంటో కూడా ఆయనే చెప్పారు కూడా.
ఆ ఐదు ఎందుకు నివారించాలంటే.
1. ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెర
డాక్టర్ మృణాళిని మాట్లాడుతూ.. "ఇది బొడ్డు కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, ఆకలి కోరికలను పెంచుతుంది. కాబట్టి, దీన్ని ఎంత త్వరగా నివారిస్తే అంత మంచిది." అని సూచించారు.
2. తెల్ల ఉప్పు
పరిమితంగా తీసుకోకపోతే పొట్ట ఉబ్బరం, అధిక బిపి (రక్తపోటు) కూడా రావొచ్చు
3. తెల్ల బియ్యం
దీన్ని (తెల్ల బియ్యం) కూరగాయలతో కలిపి మితమైన పరిమాణంలో తీసుకుంటే పర్లేదు లేదంటే బరువు వేగంగా పెరిగిపోయేందుకు దారితీస్తుందని హెచ్చరించారు డాక్టర్ మృణాళిని.
4. మైదా
బియ్యంలో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కానీ మైదాలో పూర్తిగా జీరో కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు పెరగడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు
5. పాలు, పెరుగు వెన్న వంటి పాల ఉత్పత్తులు
ఇవి కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కానీ, 40 ఏళ్ల తర్వాత, జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుందట. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. అప్పుడే పొట్ట ఉబ్బరం, అధిక బరువు సమస్య దరిచేరవని అంటున్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Success Story: డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్కు! మనసును కదిలించే సక్సెస్ స్టోరీ..)


