పల్లికట్టు శబరిమలైకి - కల్లుమ్ ముల్లుం కాలికి మెత్తె" అంటూ భక్తిపారవశ్యంతో నడిచి ఆ అయ్యప్ప దర్శనం చేసుకున్న భక్తులకు తిరుగు ప్రయాణం కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎంతో శ్రమకోర్చి కాలినడకన వచ్చి మరి ఆ అయ్యప్పను దర్శనం చేసుకున్నవారికి తిరుగు ప్రయాణం కష్టాలు కన్నీళ్లు పెట్టించేస్తున్నాయి. ఎలాంటి పరిష్కారం చూపకుండా మీపాట్లు మీరు పడండని గాలికి వదిలేశారంటూ మండిపడుతున్నారు. అస్సలు మా తిరుగు ప్రయాణం కష్టాలు ఎవ్వరికి పట్టవా అని ఆక్రోశిస్తున్నారు భక్తులు.
నిజానికి శబరిమల ప్రధాన పార్కింగ్ ప్రాంతం నీలక్కల్. అయితే అయ్యప్ప దర్శనం చేసుకున్న యాత్రికులను నీలక్కల్ తీసుకుపోవడానికి బస్ స్టాప్ త్రివేణి వద్ద ఉంది. అందుకోసం బస్లులు పెట్రోల్ పంప్ దగ్గర యు-టర్న్ తీసుకొని నీలక్కల్కు వెళ్లడానికి త్రివేణికి చేరుకుంటాయి. మరోవైపు యాత్రికులు రోడ్డుపైకి రాకుండా నిరోధించడానికి బారికేడ్లు నిర్మించారు. అలాగే బస్సు ఎక్కడానికి ఒకే ఒక మార్గం ఉంది. దీంతో బస్సు రాగానే నిరీక్షిస్తున్న వందలాది మంది యాత్రికులు ఒకేసారి ఎక్కేందుకు ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగి ఎక్కే వీలు లేకుండా పోతోంది.
హెల్తీగా ఉన్నవాళ్లు ఏదోలా ఎక్కేసినా..ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. మొత్తం మూడు బస్సులు కలిసి త్రివేణికి చేరుకుంటాయి. అయితే బస్సు రావడంతోనే ఎక్కే హడావిడిలో ఉంటారు ప్రయాణికులు..మరోవైపు ఒక బస్సు తలుపు మాత్రమే తెరుస్తారు. పోనీ మూడు బస్సులు ఒకేసారి డోర్లు తెరిచిని కాస్త పరిస్థితి చక్కబడేది. అలా కాకుండా ఒక బస్సు తర్వాత ఒకటి డోర్ ఓపెన్ చేయడంతో రద్దీ ఎక్కువై..చాలామంది అయ్యప్ప భక్తులు ఎక్కలేక నాన అవస్థలు పడుతున్నారు. బస్సులు వస్తూనే ఉంటున్నాయి కానీ తాము ఎక్కలేకపోతున్నాం అని భక్తులు చాలా బాధగా వాపోతుండటం గమనార్హం.
పరిష్కారం కానీ జఠిల సమస్యలా..
ప్రయాణికులు ఎంతలా ఫిర్యాదు చేసినప్పటికీ..పరిష్కారం కానీ జఠిలా సమస్యలా అలానే ఉంది అక్కడ పరిస్థితి. అసలు సన్నిధానం వద్ద అన్ని సమస్యలలో జోక్యం చేసుకునే స్పెషల్ కమిషనర్, ఏడీఎం ఈ సమస్యకు ఎందుకు పరిష్కారాన్ని సూచించడం లేదని మండిపడుతున్నారు భక్తులు.
బస్సు ఎక్కడానికి క్యూ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది భక్తులందరి ప్రధాన డిమాండ్. కానీ ఇప్పటి వరకు అధికారులు దీనిపై ఎలాంటి నిర్ణయం గానీ పరిష్కారం గానీ సూచించకపోవడం అత్యంత బాధకరం.
(చదవండి: శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా)


