
భద్రాచలం తరహాలోనే కల్యాణ వేడుకల నిర్వహణ
వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణం, పట్టాభిషేకం
తెల్లని దుస్తులు, నెత్తిన టోపీతో వేడుకలు తిలకించే భక్తులు
మతసామరస్యానికి ప్రతీక ఇల్లెందు నాగుల్ మీరా దర్గా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని హజ్రత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ దర్గాలో సీతారాములకు శాస్తోక్త్రంగా కల్యాణం జరిపించడమే కాదు ఆ మరుసటి రోజు కోదండ రాముడికి ఘనంగా పట్టాభిషేకం కూడా చేస్తారు.
ఇల్లెందు పట్టణానికి చెందిన సత్యనారాయణ ఈ దర్గాకు మాలిక్గా ఉన్నారు. 1960వప్రాంతంలో నాగుల్మీరా ఆయన కు కలలో కనిపించి సత్యనారాయణపురం సమీపంలోని అడవుల్లో తాను ఉన్నానని చె΄్పారు. అప్పటి నుంచి ఈ గుట్టపై ఓ చెట్టు కింద పుట్టలో కొలువై ఉన్న నాగుల్మీరాను ఆయన పూజించడంప్రారంభించారు.
కాలక్రమంలో ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు ఈ దర్గాకు రావడం మొదలైంది. 1972 నాటికి ఈ అడవిలో దర్గా వెలిసింది. గడిచిన పాతికేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నుంచి కులమతాలకు అతీతంగా ఇక్కడికి భక్తులు రావడం మొదలైంది. ఈ క్రమంలో 2008లో కొందరు భక్తులు తమిళనాడు నుంచి సీతారాముల పంచలోహ విగ్రహాలను దర్గా ఆవరణలో ప్రతిష్టించి పూజించడంప్రారంభించారు. దర్గా ఆవరణలో ఒకవైపు మహ్మదీయ సంప్రదాయ ప్రకారంప్రార్థనలు నిర్వహిస్తూనే మరోవైపు హిందూ సంప్రదాయంలో శ్రీరాముడికి పూజలు చేసే ఆనవాయితీ మొదలైంది.
నవమి కల్యాణం
శ్రీరామనవమి సందర్భంగా నాగుల్మీరా దర్గా ఆవరణ లో తొలిసారిగా 2013లో శ్రీరాముడికి కల్యాణం, ఆ మరుసటి రోజు పట్టాభిషేకం జరిపించారు. వేదపండితులు శాస్తోక్త్రంగా ఈ వేడకలు నిర్వహించగా భక్తులు కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను కనులారా వీక్షించారు. హిందూ – ముస్లిం భాయి భాయి అనే స్ఫూర్తికి మరోసారిప్రాణప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ప్రతి నవమికి ఇక్కడ కల్యాణం, పట్టాభిషేక వేడుకలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు.
పట్టాభిషేకం ప్రత్యేకం
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల్లో శ్రీరాముడి కల్యాణం జరిపిస్తారు. అంతటితో వేడుకలు ముగిస్తారు. భద్రాచలం తరహాలోనే సత్యనారాయణపురం దర్గాలో కూడా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని తొమ్మిది మంది వేదపండితులు శాస్తోక్త్రంగా జరిపిస్తూ శ్రీరాముడికి కిరీటధారణ చేస్తారు.
దమ్మక్క వారసుల తలంబ్రాలు
పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ తొలిసారిగా భద్రాచలంలో సీతారాములకు పూజాదికాలు నిర్వహించింది. భద్రాద్రి రాముడికి తొలిసారిగా పూజలు అందించిన పోకల దమ్మక్క వారసుల్లో కొందరు నవమి సందర్భంగా దర్గాలో జరిగే కల్యాణ తంతుకు తొలి తలంబ్రాలు పంపిస్తారు. అదే విధంగా సత్యనారాయణపురం గ్రామంలోని రామాలయంలో జరిగే శ్రీరాముడి కల్యాణానికి దర్గా నుంచి ముత్యాల తలంబ్రాలు పంపే విధానం కూడా మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయప్రాంగణంలో శ్రీరాముడికి గుడిని నిర్మించాలని సంకల్పించారు. ఈ దర్గాప్రాంగణంలోనే చర్చి, మసీదు, గురుద్వారాలను కూడా నిర్మిస్తామని భవిష్యత్తులో సకల మతాల సమ్మేళనానికి ఈ దర్గాను వేదికగా మారుస్తామని ఇక్కడి భక్తులు అంటున్నారు.
– సూరం శ్రావణ్రెడ్డి, సాక్షి, ఇల్లెందు రూరల్