Rama Navami 2025: పిబరే రామరసం.. | Sri Rama Navam 2025 | Sakshi
Sakshi News home page

Rama Navami2025: పిబరే రామరసం..

Apr 6 2025 8:38 AM | Updated on Apr 6 2025 8:38 AM

Sri Rama Navam 2025

రామో విగ్రహవాన్‌ ధర్మః సాధుః సత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానం మఘ వానివ’
శ్రీరాముడి వ్యక్తిత్వం ఏమిటో తెలిపే ఈ శ్లోకాన్ని మారీచుడి నోట పలికించాడు వాల్మీకి. రాముడు అంటే మూర్తీభవించిన ధర్మం. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధుజీవనుడు. అతడి పరాక్రమానికి తిరుగు లేదు. దేవతలకు దేవేంద్రుడు ప్రభువు అయినట్లుగానే, సకల చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్ముడు శ్రీరాముడు. శ్రీమహావిష్ణువు దాల్చిన దశావతారాలలో రామావతారం పూర్ణావతారం. వేదవిహితమైన ధర్మం భౌతిక నేత్రాలకు గోచరించదు. ఆచరణీయమైన ధర్మం ఆకారం దాల్చాలనే కోరికతో శ్రీరాముడి రూపంలో భూమిపై అవతరించిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. వాల్మీకి రచించిన రామాయణం మనకు ఆదికావ్యం. ‘ఆయనం’ అంటే గమనం అని అర్థం. రాముడి గమనమే రామాయణం. భూమ్మీద నరుడిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి– ఇదీ ధర్మం అని సర్వలోకాలకు చాటిచెప్పాడు శ్రీరాముడు.

రామాయణ గాథ మన దేశంలో పామరులకు కూడా తెలుసు. శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్యదైవమే కాదు, ఆదర్శదైవం కూడా! ఆసేతు హిమాచలం మన దేశంలో రామాలయాలు లేని ఊళ్లు ఉండవు. అయోధ్య నగరంలో పుట్టిన రాముడు పితృవాక్య పరిపాలన కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. రాముడు వనవాసంలో ఉండగానే, సీతాపహరణం జరిగింది. సీతను అపహరించిన రావణుడి జాడ వెదుక్కుంటూ, దండకారణ్యంలో సంచరిస్తున్న శ్రీరాముడిని హనుమంతుడు తొలిసారిగా కలుసుకున్నాడు. ఆనాటి నుంచి ఆయనకు నమ్మినబంటు అయ్యాడు. రామలక్ష్మణులను తన ప్రభువు సుగ్రీవుడి వద్దకు తీసుకుపోయి, అతడితో మైత్రి కుదిర్చాడు. సుగ్రీవాజ్ఞతో సీతను వెదకడానికి వానరవీరులు నలుదిక్కులకూ బయలుదేరారు. 

దక్షిణంవైపు బయలుదేరిన బృందంలో ఉన్న హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకకు చేరుకుని సీతమ్మవారి జాడ కనుగొన్నాడు. ఆమెకు కనిపించి, ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత లంకాదహనం చేసి మరీ రామదండు ప్రతాపం ఎలాంటిదో రావణుడికి రుచి చూపించాడు. లంక నుంచి తిరిగి వచ్చి, శ్రీరాముడికి సీతమ్మవారి క్షేమ సమాచారాన్ని తెలిపాడు. వానరసైన్యంతో లంకకు చేరుకున్న రాముడు చివరకు రావణుడిని వధించి, సీతను అయోధ్యకు తీసుకువచ్చి, పట్టాభిషిక్తుడయ్యాడు. స్థూలంగా ఇదీ రామాయణం. రామాయణం దేశ విదేశాల్లోని పలు భాషలలోకి అనువదితమైంది. రామాయణానికి సంబంధించి వేర్వేరు భాషలలో వేర్వేరు కథలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రామాయణాలు ఉన్నా, వాల్మీకి విరచితమైన రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. 

శ్రీరాముడి ధర్మనిరతికే కాదు, ఉదాత్తతకు, స్వదేశాభిమానానికి కూడా రామాయణంలో ఉదాహరణలు ఉన్నాయి. రావణ సంహారం తర్వాత లంకాపుర వైభవాన్ని తిలకించి, లక్ష్మణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎటు చూసినా స్వర్ణకాంతులతో ధగధగలాడుతూ కనిపించింది లంకానగరం. ‘అన్నా! ఈ లంకానగరం స్వర్ణకాంతులతో ఎంత శోభాయమానంగా ఉందో కదా!’ అన్నాడు లక్ష్మణుడు. అందుకు బదులుగా శ్రీరాముడు చిరునవ్వు చిందిస్తూ–

‘అపి స్వర్ణమయీం లంకామ్‌ లక్ష్మణ కానన రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని పలికాడు.
అంటే, ‘లక్ష్మణా! ఈ లంకానగరం ఎంతగా బంగారు కాంతులతో ధగధగలాడుతున్నా, ఇది నాకు రుచించడం లేదు. కన్నతల్లి, పుట్టిననేల స్వర్గం కంటే గొప్పవి’ అని పలికాడు. రావణుడిని సంహరించి, యుద్ధంలో జయించినా, రాముడు లంకను స్వాధీనం చేసుకోలేదు. విభీషణుడిని లంకకు పట్టాభిషిక్తుడిని చేసి, సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చేశాడు. శ్రీరాముడి స్వదేశాభిమానానికి ఇది మచ్చు తునక. రామ రావణ యుద్ధంలో రావణుడు మరణించాక, ‘నా అన్న అయినా, ఇతడు పాపాత్ముడు. ఇటువంటి పాపాత్ముడికి అంత్యక్రియలు చేయడం కూడా పాపమే’ అని నిష్ఠురంగా పలికాడు విభీషణుడు. అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి హితవు చెప్పాడు.

‘మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనం
క్రియాతాం అన్య సంస్కారో మయాప్యేష యథాతవ’ అని పలికాడు. 
అంటే, ‘వ్యక్తులు మరణించిన తర్వాత వారితో వైరం ఉండకూడదు. ఇతడికి అంత్యక్రియలు చెయ్యి. ఇతడు నీకులాగానే నాకు కూడా గౌరవార్హుడే!’ అన్నాడు. ఇది శ్రీరాముడి ఔదార్యానికి ఉదాహరణ. శ్రీరాముడు ఇంతటి ఉదాత్తుడు, ధర్మనిరతుడు కావడం వల్లనే ప్రజలకు ఆరాధ్య దైవమయ్యాడు. 

శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరాముడు చైత్ర శుక్ల నవమి నాడు జన్మించాడు. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి చేరుకున్నాక ఇదే తిథినాడు పట్టాభిషిక్తుడయ్యాడని, సీతారాముల కల్యాణం కూడా చైత్ర శుక్ల నవమి రోజునే జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామ నవమి రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లోనూ, ఊరూరా ఏర్పాటు చేసే మంటపాల్లోను సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేసవి ప్రారంభంలో వచ్చే పండుగ కావడంతో శరీరానికి చలవ చేసే వడపప్పును, పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తెలంగాణలోని భద్రాచలంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలోను శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకల్లో నైవేద్యంగా గోధుమరవ్వ హల్వా, పూరీలు, గోధుమపిండితో తయారు చేసే ‘పింజిరి’ అనే మిఠాయి, పాయసం, ఉడికించిన శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు. భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాల గురించి తెలుగు ప్రజలకు తెలుసు. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య సహా దేశ విదేశాల్లో పలుచోట్ల విశేషమైన రామాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా పురాతనమైనవి కూడా ఉన్నాయి. అయోధ్య సహా కొన్ని అరుదైన రామాలయాల గురించి తెలుసుకుందాం.

అయోధ్య బాల రామాలయం
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో నిర్మించిన బాల రాముడి (బాలక్‌ రామ్‌) ఆలయం గత ఏడాది జనవరి 22న ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయంలో నెలకొల్పిన బాల రాముడి విగ్రహానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. అయోధ్య బాల రామాలయంలో ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. 

జనక్‌పూర్‌ సీతా రాముల ఆలయాలు
సీతమ్మవారి జన్మస్థలమైన జనక్‌పూర్‌ నేపాల్‌లో ఉంది. ఇక్కడ పురాతన జానకీమాత ఆలయం ఉంది. ఇదే పట్టణంలోని కులదేవీ ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా రామాలయం ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా జనక్‌పూర్‌లోని జానకీమాత ఆలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు వారం రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. సీతారాముల విగ్రహాలకు అభిషేకాలు జరిపి, మైథిలీ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు. లక్షలాది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మైథిలీ సంస్కృతికి అద్దంపట్టేలా పలు సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఓర్ఛా రాజారామ్‌ ఆలయం
మధ్యప్రదేశ్‌లోని ఓర్ఛా పట్టణంలో పురాతన రాజారామ్‌ ఆలయం ఉంది. ఓర్ఛా మహారాజు మధుకర్‌ షా జు దేవ్‌ పదహారో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాజప్రాసాదాన్ని తలపించేలా అడుగడుగునా రాజసం ఉట్టిపడే ఈ ఆలయంలో శ్రీరాముడు సింహాసనంపై సీతాసమేతంగా ఆసీనుడై తన పరివారంతో కొలువుదీరి భక్తులకు కనువిందు చేస్తాడు. సీతారాముల సింహాసనానికి çకుడివైపు లక్ష్మణుడు, ఎడమ వైపు సుగ్రీవుడు, కిందన ప్రార్థిస్తున్న భంగిమలో హనుమంతుడు, జాంబవంతుడు ఉంటారు. ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.

నాసిక్‌ కాలారామ్‌ ఆలయం
నాసికా త్రయంబకేశ్వరం శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. గోదావరి నది పుట్టిన చోటు ఇక్కడే ఉంది. ఇదే పట్టణంలో పురాతనమైన రామాలయం కూడా ఉంది. దీనిని స్థానికులు ‘కాలారామ్‌’ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో రాముడి విగ్రహాన్ని నల్లరాతితో మలచడం వల్ల ‘కాలారామ్‌’ అనే పేరు వచ్చింది. ఆలయ ప్రవేశమార్గంలో నల్లరాతితో మలచిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం రాష్ట్రకూటుల నాటిదని చరిత్రకారుల అంచనా. సుమారు ఏడో శతాబ్దినాటి ఈ ఆలయంపై దండయాత్ర జరిగినప్పుడు విగ్రహాలను ఒక బావిలో పడవేశారు. తర్వాత వాటిని బయటకు తీసి, పునఃప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణానికి పద్దెనిమిదో శతాబ్ది తొలినాళ్లలో సర్దార్‌ రంగారావు ఓఢేకర్‌ నిధులు సమకూర్చారు. శ్రీరామ నవమినాడు ఈ ఆలయంలో ఘనంగా వేడుకలు జరుగుతాయి.

కుంభకోణం రామస్వామి ఆలయం
తమిళనాడులోని కుంభకోణంలో పదహారో శతాబ్ది నాటి రామస్వామి ఆలయం ఉంది. తంజావూరు నాయక రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం దేశంలోని పురాతన రామాలయాల్లో ఒకటి. అచ్యుతప్ప నాయకుని హయాంలో మొదలైన దీని నిర్మాణం రఘునాథ నాయకుని కాలంలో పూర్తయింది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. 

జమ్ము రఘునాథ ఆలయం
జమ్ము నగరంలో తావి నదీ తీరానికి ఉత్తరాన రఘునాథ స్వామి ఆలయం ఉంది. పద్దెనిమిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణంలో రఘునాథుడిగా శ్రీరాముడు కొలువైన ఆలయం ప్రధానమైనది. ఇదే ప్రాంగణంలో సూర్యభగవానుడి ఆలయం, శ్రీమహావిష్ణువు ఆలయం కూడా ఉన్నాయి. రఘునాథ స్వామి ఆలయంలో సీతా రామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు కొలువై కనిపిస్తాయి. ఏటా శ్రీరామ నవమి రోజున ఈ ఆలయంలో సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

సైదాపూర్‌ రామ్‌కుండ్‌ మందిరం
పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ శివార్లలోని సైదాపూర్‌లో పురాతనమైన రామ్‌కుండ్‌ మందిరం ఉంది. వనవాస కాలంలో సీతా రామ లక్ష్మణులు ఇక్కడ కొంతకాలం గడిపారని చెబుతారు. పదహారో శతాబ్దిలో అంబర్‌ పాలకుడు మాన్‌ సింగ్‌ ఈ ఆలయాన్ని నిర్మించాడు. కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరువలో ఉన్న తటాకాన్ని ‘రామ్‌ కుండ్‌’ (రామ కుండం) అని పిలుస్తారు. ఈ తటాకానికి చేరువలోనే భక్తుల బస కోసం ధర్మసత్రాన్ని కూడా మాన్‌ సింగ్‌ కాలంలోనే నిర్మించారు. ఇస్లామాబాద్‌ నగరాభివృద్ధిని పర్యవేక్షించే రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (కేపిటల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) 2006లో ఈ ఆలయాన్ని పర్యాటక ఆకర్షణగా మలచేందుకు చర్యలు చేపట్టి, విగ్రహాలను తొలగించింది. అప్పటి నుంచి ఇక్కడ పూజాదికాలు నిలిచిపోయాయి. అయితే, దీనిని సందర్శించుకోవడానికి పర్యాటకులను మాత్రం అనుమతిస్తున్నారు.

అమృత్‌సర్‌ రామతీరథ్‌ మందిరం
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ శివార్లలో రామతీరథ్‌ మందిరం ఉంది. ఈ ప్రదేశంలోనే సీతమ్మవారు వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందిందని, ఇక్కడే లవకుశులు జన్మించారని స్థలపురాణం చెబుతోంది. రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడే రచించాడని కూడా స్థలపురాణ కథనం. ఈ ఆలయం ప్రస్తుతం కనిపిస్తున్న రూపంలో 2016లో దీనిని పునర్నిర్మించారు. ఈ ఆలయం ఎదుట తటాకం, ఆలయ ప్రాంగణంలోని ఎనభై అడుగుల భారీ ఆంజనేయ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయంలో ఏటా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా సీతారామ కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది.∙ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement