వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే! | Mumbai Man Offers To Hear Problems For Money On Beach Viral | Sakshi
Sakshi News home page

వెరైటీ బిజినెస్‌.. స‌మ‌స్య‌ను బ‌ట్టి రేటు!

Mar 20 2026 6:15 PM | Updated on Mar 20 2026 6:56 PM

Mumbai Man Offers To Hear Problems For Money On Beach Viral

చిన్న స‌మ‌స్య అయితే రూ. 250, పెద్ద స‌మ‌స్య అయితే ఐదు వంద‌ల రూపాయ‌లు.. ఇవేమీ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి పెట్టిన ధ‌ర‌లు కావు. బ్యాంకుల్లో స‌ర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మ‌రేంటి? సాటి మ‌నుషుల బాధ‌ల‌ను విన‌డానికి ఓ వ్య‌క్తి నిర్ణ‌యించిన‌ ధ‌ర‌లు ఇవి. ఏంటి స‌మ‌స్య‌లు విన‌డానికి డ‌బ్బులు ఇవ్వాల‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్‌కు వెళ్లాల్సిందే.

ముంబై మ‌హాన‌గ‌ర‌ స‌ముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ ప‌ట్టుకున్న ఓ వ్య‌క్తి వీడియో తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అత‌డు ప‌ట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధ‌లు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అత‌డి రెండు ఫోన్‌ నంబ‌ర్ల‌తో పాటు ఏ స‌మ‌స్య‌కు ఎంత మొత్తం తీసుకుంటాడ‌నే వివ‌రాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆస‌క్తిగా అనిపించి ఓ వ్య‌క్తి అత‌డితో మాట క‌లిపాడు. దాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ మారింది.

క‌లిసి ఏడ‌వ‌డానికి రూ. 1000!
చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్ల‌మ్స్ అయితే రూ. 500 తీసుకుంటాన‌ని అత‌డు చెప్పాడు. స‌మ‌స్య‌లు విన‌డ‌మే కాకుండా కలిసి కూర్చుని త‌నివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయ‌లు ఇవ్వాల‌ని తెలిపాడు. డ‌బ్బు చెల్లించి ఇలా ఎవ‌రైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయ‌రు'' అంటూ ప్ర‌శ్నించాడు. త‌న సేవ‌ల‌కు మ‌న్నన ద‌క్కుతుంద‌ని చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడ‌త‌ను. త‌న పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra)  అని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినేందుకే తానిక్క‌డ ఉన్నాన‌ని చెప్పాడు. త‌న‌కు ఇన్‌స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉంద‌ని వెల్ల‌డించాడు. 

భావోద్వేగ మద్దతు కోసం
పృథ్వీరాజ్ వీడియో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌నుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొంత మంది అత‌డి సేవ‌ల‌ను మెచ్చుకుంటే, మ‌రికొంద‌రు డ‌బ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమ‌ర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మ‌హాన‌గ‌రాల్లో ఒంట‌రి జీవితాలు వెళ్ల‌దీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవ‌స‌రమ‌న్న వాద‌న‌తో అంద‌రూ ఏకీభ‌విస్తున్నారు. క‌ష్ట‌సుఖాలు పంచుకునేందుకు, మ‌నుసులోని భావాలు పంచుకునేందుకు మ‌నుషులు క‌ర‌వవుతున్న న‌గ‌ర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వార‌ని పేర్కొంటున్నారు.

చ‌ద‌వండి: ‘నంబర్‌ 1’ ఎప్పటికీ ఒంటరే!

కాగా, ఈ వైర‌ల్ వీడియో తీవ్ర‌మైన స‌మ‌స్య‌ను వెలుగులోకి తెచ్చింద‌ని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కార‌ణంగా న‌గ‌ర జీవులు మాన‌సిక స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నార‌ని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేక‌పోవ‌డంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. త‌మ బాధ‌ల‌ను ఎవ‌రితో పంచుకోవాలో తెలియ‌క పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్ల‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని వివ‌రించారు. 

నెటిజ‌నుల స్పంద‌న‌
పృథ్వీరాజ్ బోహ్రా వైర‌ల్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్‌లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒక‌రు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మ‌రొక‌రు పేర్కొన్నారు. ఇలాంటి సేవ‌ల‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామ‌ని కొంద‌మంది స‌ర‌దాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మ‌హా న‌గ‌రాల్లో మ‌నుషుల‌ను ఒంటిత‌నం ఎంత‌గా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్ల‌డిస్తున్నాయ‌ని, ఇక్క‌డ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజ‌నులు అంటున్నారు. అయితే మ‌నుషుల బాధ‌ల‌ను అలుసుకుగా తీసుకుని మోస‌గించే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement