చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! | Man who donated More Than Rs 4 lakh for tree planting in China | Sakshi
Sakshi News home page

చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ

May 24 2026 3:17 PM | Updated on May 24 2026 4:11 PM

Man who donated More Than Rs 4 lakh for tree planting in China

మోడు వారిని భూమిని కొంచెం మనసుపెట్టి, శ్రమించి పచ్చదనంతో కళకళలాడేలా చేయొచ్చు. అదే ఎడారిలో అంత ఈజీకాదు. చాలామటుకు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎడారిలో అడవిని పెంచడం మాటల్లో చెప్పినంత సులభం అస్సలు కాదు. ఒక వేళ పెంచినా.. మనుగడ సాధించగలడంమనేది ప్రశ్నార్థకమే. అలాంటిది సుసాధ్యం చేసి చూపించింది ఓ మహిళ. ఆనాడు ఆ చేస్తున్న పనికి సాయం అందిస్తూ కూడా..ఎడారిలో పచ్చదనం వస్తుందా అన్న ప్రశ్న ఎదురైన వెరవక ముందుకు సాగిన పచ్చని తల్లి ఆమె.

అంతర మంగోలియాలోని మావోవుసు ఎడారిలో ఎడారీకరణను ఎదుర్కోవడానికి దశాబ్దాలుగా చెట్లను నాటుతోంది చైనాకు చెందిన 60 ఏళ్ల యుజెన్‌. 1980లలో వివాహం అనంతరం భర్తతో కలిసి మంగోలియాలోని మావోసు ఎడారికి వెళ్లింది. ఆ ప్రదేశం బలమైన గాలులు, కరువుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. అలాంటి వాతావరణంలో నివశిస్తూ..ఎడారి వ్యాప్తిని ఆపేలా చెట్లను నాటే ప్రయత్నం చేశారు ఆ దంపతులు. ఆ పని అత్యంతకష్టమైనప్పటికి ఆ జంట ఏళ్ల తరబడి ఆ ప్రయత్నం కొనసాగించింది. 1996లో ఆమె కథ చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో ప్రసారమైంది. 

దాంతో ఒక్కసారిగా యుజెన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆమె అంకిత భావానికి స్ఫూర్తి పొందిన రోనాల్డ్‌ సకోల్స్కీ అనే అమెరికన్‌ ఉపాధ్యాయుడు ఆమె లక్ష్యానికి మద్దతుగా సుమారు రూ. 4,80,000 ఇచ్చాడు. అంత పెద్ద మొత్తం చూసి ఆశ్చర్యపోయిన యుజెన్‌..ఆ డబ్బులు మొత్తం మొక్కలు నాటేందుకే వినియోగించింది. సకోల్స్కీ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌ స్కూల్‌లో పనిచేస్తుండేవారు. ఆయన ఒక రోజు ఎడారిలో మొక్కలు నాటుతున్న యుజెన్‌ను చూసి అబ్బురపడ్డారు. 

కానీ ఆమె ప్రయత్నం సాధ్యమవుతందా నిరర్థకం అవుతుందో తెలియదు గానీ..తన వంతుగా మద్దతు అంటూ అంత సొమ్ము ఇచ్చారాయన.  కాలక్రమేణ ఎడారిలో 50 వేలకు పైగా చెట్లు పెరిగి బీడు వారిని ఎడారి కాస్తా పచ్చని భూమిలా కనువిందు చేయడం ప్రారంభించింది. ఆ అడవిని ఎలాగైనా.. ఆ ఉపాధ్యాయుడు సకోల్స్కీకి చూపించాలని యుజెన్‌ ఎంతో ప్రయాసపడి సదరు స్కూల్‌ సాయంతో అతడి ఆచూకిని తెలుసుకుని మరి ఆ అడవిని చూసేందుకు ఆహ్వానించింది. అతను ఆ ఆహ్వానానికి ఉబ్బితబ్బిబవ్వుతూ..ఆ ఫలితాన్ని చూడాలని ఎంతో కుతూహలంగా ఉందని చెప్పాడు. 

ఈ కథ చైనాలోని ప్రతిఒక్కరిని కదలించింది. యుజెన్‌ ప్రయత్నమే అభినందనీయం అనుకుంటే.. ఆయన ఆమె ప్రయత్నానికి మద్దుతివ్వడం మరింత విశేషం. పైగా చాలామంది దీనిని సరిహద్దులు దాటి చూపిన దయ, నమ్మకం, సహకారానికి సంబంధించి..హృదయాన్ని తాకే కథగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పర్యావరణ ప్రయత్నాల ద్వారా ఇటీవల సంవత్సరాలలో ఎడారీకరణకు గురైన భూమిని తగ్గించడంలో చైనా గణనీయమైన పురోగతి సాధించిందని అధికారులు కూడా పేర్కొన్నారు.

(చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్‌కట్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌)

 

Advertisement
 
Advertisement
Advertisement