నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బ్లూటూత్ ఇయర్ఫోన్ల వాడకం ప్రతీ ఒక్కరికీ అవసరంగా మారింది. ఆఫీసు పనులైనా, ప్రయాణాలైనా ఇవి లేనిదే ఎవరూ ముందుకు నడవడం లేదు. అయితే వీటిని నిరంతరం వాడటం వల్ల రేడియేషన్ బారిన పడి ‘బ్రెయిన్ ట్యూమర్’ (మెదడు కణితి) వచ్చే ప్రమాదం ఉందంటూ, సోషల్ మీడియాలో తరచూ కథనాలు కనిపిస్తుంటాయి. ఇంతకీ ఇలాంటి భయాల్లో నిజమెంత? సైన్స్ ఏం చెబుతోంది? ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రూపా జుతానీ దీనిపై సంచలన వివరణ ఇచ్చారు.
అసలు నిజం ఏంటి?
అమెరికాకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రూపా జుతానీ.. మెదడు, నాడీ వ్యవస్థకు సంబంధించిన ట్యూమర్ల చికిత్సలో నిపుణురాలు. ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ అంశంపై నెలకొన్న అపోహలను శాస్త్రీయంగా తిప్పికొట్టారు. బ్లూటూత్ హెడ్ఫోన్ల వాడకానికి, బ్రెయిన్ ట్యూమర్లకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తూ.. ‘మెదడులో పెరిగే ట్యూమర్లు, వినికిడి నాడుల వద్ద వచ్చే గడ్డలు (వెస్టిబ్యులర్ స్క్వానోమాస్), క్యాన్సర్ గడ్డలకు సర్జరీ చేసే వైద్యురాలిగా, సైన్స్ ఏం చెబుతుందో వివరిస్తున్నాను. బ్లూటూత్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు’ అని ఆమె స్పష్టం చేశారు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
డాక్టర్ జుతానీ తన వివరణకు తోడుగా 2022లో నిర్వహించిన పరిశోధనను ఉదాహరించారు. దాదాపు 10 లక్షల మంది మహిళలపై 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో, బ్లూటూత్ లేదా సాధారణ హెడ్ఫోన్ల వాడకం వల్ల ఎలాంటి బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే అవకాశం లేదని తేలింది. ఈ సుదీర్ఘ అధ్యయనం ఇయర్ ఫోన్ల వినియోగదారుల్లో ఉన్న భయాన్ని పటాపంచలు చేసింది.
రేడియేషన్కు భయపడాలా?
సాధారణంగా రేడియేషన్ అనగానే ఎవరికైనా సరే క్యాన్సర్ గుర్తుకు వస్తుంది. అయితే అన్ని రకాల రేడియేషన్లు ప్రమాదకరం కావు. డాక్టర్ జుతానీ వివరణ ప్రకారం బ్లూటూత్ పరికరాల నుండి ‘నాన్-అయోనైజింగ్ రేడియేషన్’ విడుదల అవుతుంది. ఇది ఎక్స్-రేలు లేదా ఇతర ప్రమాదకర కిరణాల మాదిరిగా మన శరీరంలోని డీఎన్ఏ (డీఎన్ఏ)ను దెబ్బతీయదు. డీఎన్ఏ దెబ్బతిననప్పుడు క్యాన్సర్ లేదా ట్యూమర్లు ఏర్పడే అవకాశం ఉండదు.
ఫోన్ నేరుగా చెవి దగ్గర పెట్టుకుంటే..
మనలో చాలామంది బ్లూటూత్ వాడటం వల్ల ప్రమాదం అనుకుంటారు కానీ, అసలు ముప్పు ఫోన్ నేరుగా వాడటంలోనే ఉందని డాక్టర్ జుతానీ హెచ్చరించారు. బ్లూటూత్ ఇయర్ఫోన్ల కంటే, మొబైల్ ఫోన్ను నేరుగా చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడినప్పుడు రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సమయాల్లో ఫోన్ను తలకి దూరంగా ఉంచాలని ఆమె సూచించారు. ఫోన్ కాల్ వెళ్తున్న సమయంలో రేడియేషన్ స్థాయిలు గరిష్టంగా ఉంటాయని, అలాగే ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా రేడియేషన్ ఎక్కువగా వెలువడుతుందని ఆమె తెలిపారు. అటువంటి సమయంలో ఫోన్ నేరుగా చెవికి ఆనించి మాట్లాడటం కంటే ఇయర్ఫోన్స్ వాడటమే సురక్షితమని ఆమె తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రేడియేషన్ ముప్పు లేకపోయినా, అతిగా హెడ్ఫోన్లు వాడటం వల్ల వినికిడి శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి డాక్టర్ జుతానీ కీలక సూచనలు చేశారు.
స్పీకర్ మోడ్: వీలైనంత వరకు ఫోన్ను స్పీకర్ మోడ్లో పెట్టి మాట్లాడటం అన్నిటికంటే ఉత్తమం.
సరైన వినియోగం: టెక్నాలజీని అవసరమైన మేరకే వాడాలి. పని పూర్తయిన వెంటనే ఇయర్ఫోన్లను చెవుల నుండి తొలగించి, దాచుకోవాలి.
ఫోన్ దూరం: ఫోన్ను నేరుగా చెవికి ఆనించి మాట్లాడటం వల్ల వినికిడి నాడులపై ఒత్తిడి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హెడ్ఫోన్లు వాడినప్పుడు ఈ ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
ఏదైనా అతిగా వాడితే..
బ్లూటూత్ ఇయర్ఫోన్లు బ్రెయిన్ ట్యూమర్లకు కారణమవుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని డాక్టర్ జుతానీ స్పష్టం చేశారు. అయితే, ఏదైనా అతిగా వాడటం ఆరోగ్యానికి హానికరం. వైర్లెస్ సాంకేతికతను వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఫోన్ను నేరుగా తలకు ఆనించి మాట్లాడకుండా ఉండటం శ్రేయస్కరం.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ‘అది వివక్ష కాదు.. ఆచారం’


