కుక్కునూరు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుక్కునూరు మండలంపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. మండలంలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యం తెగిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాములేరు, వేలేరు గ్రామాల వద్ద ఆర్అండ్బీ రహదారి వరద నీటిలో మునిగిపోవడంతో కుక్కునూరు నుంచి బూర్గంపాడు, భద్రాచలంకు సంబంధాలు తెగిపోయాయి. వరద నీరు చుట్టుముట్టడంతో గొ మ్ముగూడెం గ్రామాన్ని ఖాళీ చేయించి, ప్రజలను దాచారం సమీపంలోని ఆర్అండ్ఆర్ కాలనీ పునరావాస కేంద్రాలకు శనివారం నాటికి పూర్తిస్థాయిలో తరలించారు. లచ్చిగూడెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గ్రామస్తులు సమీప కొండలపైకి ఎక్కి ఆశ్రయం పొందారు. వింజరం–చిరవెల్లి గ్రామాల మధ్య ఆర్అండ్బీ రహదారిని తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యగా 10 మంది సభ్యులు ఉన్న ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అధి కారులు పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలవరం రూరల్: గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 34 మీటర్లు నీటిమట్టం చేరుకుంది. స్పీల్ వే 48 గేట్ల నుంచి దిగువకు 12.09 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువుకు చేరుతోంది దిగువన వరద ప్రవాహం మరింత పెరిగింది. పోలవరంలోని కడెమ్మ స్లూయిజ్ వద్ద వరద నీరు చేరడంతో గేట్లు ముంపునకు గురయ్యాయి. దీంతో వరద నీరు పొలాల వైపు వస్తుండటంతో రైతులు ముమ్మరంగా నాట్లు వేసే పనులు ప్రారంభించారు.
పట్టిసీమ నుంచి నీరు విడుదల
గోదావరి వరద పెరుగుతుండటంతో కృష్ణా డెల్టాకు నీటి తరలింపు మరింత పెంచారు ఎత్తిపోతల పథకం నుంచి కుడి కాలువలోకి 20 మోటార్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు.


