పెనుమంట్ర: ఎల్నినో కారణంగా సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, దీని ప్రభావం డెల్టా భూములపై పెద్దగా లేకపోయినా, బోర్ల కింద సాగుచేసే పంటలపై ఉండవచ్చని తెలిపారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం శిక్షణ, సందర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ పి.రాధిక మాట్లాడుతూ.. ఎల్.నినో కారణంగా రాష్ట్రంలో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందన్నారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో కలుపు నివారణ చర్యలు ముఖ్యమన్నారు. ఇనుప ధాతు లోపం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆకులు పసుపు రంగులోకి మారతాయని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్కువ నీరు ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రాములు పిచికారీ చేయాలని, ఆరుతడి పద్ధతి పాటించాలని పొలం గట్లు గట్టిగా చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ నీరు అందుబాటులో ఉన్నపుడు పంట మూన తిరిగిన దగ్గర నుంచి పిలకలు కట్టే దశ వరకు ఆరు తడి పద్ధతిలో నీటి తడులు పెట్టుకోవాలన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఎంటీయూ 1462 రకాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ రకంగా 135–140 రోజుల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో 60,000 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయని, వర్షాల వల్ల బాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున రైతులను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది విత్తన గుళికల తయారీని, శాస్త్రవేత్తలు బ్రష్ కట్టర్ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.వి.కృష్ణాజీ, వివిధ డివిజన్ల సహాయ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు.


