నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ఐటీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో మండు వేసవిలో నీళ్లు లేక కాలనీ మహిళలు సోమవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. గత నాలుగు నెలలుగా నీటి సమస్యతో సతమతమవుతున్నా మున్సిపల్ అధికారులు గాని, పాలకులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం తమ నీటి సమస్యపై సబ్కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీని అందజేశామని అయినా ఇంత వరకు నీటి సమస్యను పరిష్కరించలేదని, ఇంక అర్జీలను తీసుకోవడం ఎందుకని వారు ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ రాజు మాట్లాడుతూ కాలనీవాసులు నీటి సమస్యతో నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నా కనీసం ట్యాంకర్లతోనైనా సరఫరా చేయాలనే ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. కాలనీలోని మంచినీటి సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రామకూరి మరియదాసు, స్థానికులు పాల్గొన్నారు.


