దేవుని భూమికే శఠగోపం
దేవుడికే శఠగోపం పెట్టి ఆలయ భూముల్ని చేపల చెరువుల్లో కలిపేసుకున్న ఉదంతమిది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు విషయం బయటకు పొక్కడంతో దేవదాయ అధికారులు హడావుడిగా గతంలోని కౌలు లీజును రద్దుచేశారు. చెరువు, పొలం కౌలులీజుకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే చెరువు మధ్యలో ఉన్న దేవస్థానం భూముల సరిహద్దులను అధికారులు ఏ విధంగా నిర్ణయిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
సాక్షి, భీమవరం, నరసాపురం రూరల్: కొప్పర్రులోని శ్రీసీతారామస్వామివారికి 468/2 సర్వే నంబరులో 1.32 ఎకరాలు, 456/1లో 1.52 ఎకరాలు, 458/1లో 1.60 ఎకరాల సాగు భూమి ఉంది. వీటిని కొందరు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. ఈ భూములు చుట్టు పక్కల గల సుమారు 30 ఎకరాల పొలాలను యజమానులు చెపల చెరువు నిమిత్తం లీజుకు ఇచ్చేశారు. ఏకమొత్తంగా చెరువు తవ్వేందుకు మధ్యలో దేవస్థానం భూములు అడ్డంగా మారాయి. స్థానిక నేత, దేవాదాయ సిబ్బంది అండదండలతో ఈ భూములను చేపల చెరువు కోసం అప్పగించేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవస్థానం భూముల్ని చెరువులో కలిపేసుకుని ఆక్వా సాగుచేస్తున్నారు.
పీజీఆర్ఎస్లో ఫిర్యాదు
నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానం భూమిని చెరువులో కలిపేయడం పట్ల గ్రామానికి చెందిన ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు యాదంరెడ్డి సూరిబాబు, బ్రహ్మాజీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. కొద్దిరోజుల క్రితం విషయం బయటకు పొక్కడంతో ఆలయ అధికారులు హుటాహుటీన పాత లీజును రద్దుచేసి రానున్న మూడేళ్ల కాలానికి కౌలు హక్కుల నిమిత్తం ఈనెల 12వ తేదీన టెండర్, బహిరంగ వేలంకు ప్రకటన విడుదల చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువులో దేవాలయ భూములు ఎక్కడున్నది సరిహద్దులు నిర్ణయించకుండా బహిరంగ వేలం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. చెరువు లీజుదారులకు మేలు చేసే ఉద్దేశ్యంలో అధికారులు ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఆలయ భూముల సరిహద్దులు నిర్ణయించిన తర్వాతనే వేలం నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే చెరువులో సరిహద్దులు ఏ విధంగా నిర్ణయిస్తారనేది తేలాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహరాన్ని మసిపూసి మారేడుకాయ చేసే పనిలో కొందరు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.సూర్యప్రకాష్ను సంప్రదించగా తన దృష్టికి రాలేదని, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘‘నరసాపురం రూరల్ కొప్పర్రులో దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చెరువును గమనించారా? ఏడాది క్రితం వరకు ఇక్కడే గ్రామంలోని దేవస్థానంకు చెందిన 4.44 ఎకరాల పంట పొలాలు ఉండేవి. కౌలుసాగు నిమిత్తం దేవస్థానం వాటిని లీజుకు ఇచ్చింది. చుట్టూ ఉన్న పంట పొలాలను ఏక ప్లాటుగా ఆక్వా చెరువు తవ్వుకునేందుకు భూ యజమానులు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. స్థానిక కూటమి నేతల అండదండలతో మధ్యలోని దేవాదాయ భూములను అడ్డగోలుగా తవ్వేసి చేపల చెరువులో కలిపేసుకుని ఆక్వాసాగు చేస్తున్నారు’’.
కొప్పర్రులో కూటమి నేతల నిర్వాకం
4.44 ఎకరాల సీతారామస్వామి ఆలయ పంట పొలాల్ని చేపల చెరువుకు ఇచ్చేసిన వైనం
అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తుల చెరువులో కలిపేసి ఆక్వాసాగు
విషయం బయటకు పొక్కడంతో హడావుడిగా లీజు రద్దు


